Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ లో టీటీడీపీ బహిరంగసభ

0 46

29న హైదరాబాద్ లో టీటీడీపీ బహిరంగసభ

హైదరాబాద్, ఫిబ్రవరి 25, ఖమ్మం బహిరంగసభ తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ సైలెంట్ అయింది. మళ్లీ మార్చిలో భారీ బహిరంగసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుటోంది. ఈ సభకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. తెలుగుదేశం పార్టీని హైదరాబాద్‌లోనే ప్రారంభించారు. అందుకే హైదరాబాద్‌లోనే వ్యవస్థాపక దినోత్సవాన్ని భారీగా నిర్వహించాలని నిర్ణయించారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబు అనుమతి కూడా తీసుకున్నారు. ఏర్పాట్లు ప్రారంభించనున్నారు. తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్ ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ సభను నిర్వహించాలన్న ఉద్దేశంలో ఉన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో రాజకీయ పార్టీలు సభలు నిర్వహిస్తూ ఉంటాయి.

ఇటీవల తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లోనే సభ నిర్వహించాలని కేసీఆర్ అనుకున్నారు. కానీ సచివాలయం వాయిదా పడటంతో సభ నిర్వహణ కూడా ఆపేశారు. వచ్చే నెల 29న తెలుగుదేశం పార్టీ ఇదే గ్రౌండ్‌లో సభ నిర్వహించాలనుకుంది. తెలుగుదేశం పార్టీ ఇటీవలి కాలంలో తెలంగాణలో స్తబ్దుగా ఉంది. అయితే కాసాని జ్ఞానేశ్వర్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత కదలిక వచ్చింది. ఖమ్మం సభను అనుకున్నదాని కన్నా ఎక్కువగా విజయవంతం చేసుకున్నామని టీడీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు. వచ్చిన జనం అంతా పక్క జిల్లాల నుంచి వచ్చారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే ప్రజల్లో టీడీపీపై ఇప్పటికీ సానుభూతి ఉందని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన పార్టీ టీడీపీనేనని వారంటున్నారు.

మార్చి 29న పరేడ్ గ్రౌండ్స్ సభకు కూడా భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీకి గట్టి బలముందని అంటున్నారు. నేతలు పార్టీలు మారి వెళ్లిపోయిన క్యాడర్, టీడీపీ సానుభూతిపరులు మాత్రం పార్టీకే అండగా ఉంటారని అంటున్నారు. ఈ క్రమంలో సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అనుకుంటున్నారు. చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీకి బలం ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. కనీసం నలబై నియోజకవర్గాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ , ఖమ్మం నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాంతాల్లో సభల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణలో టీడీపీ రాజకీయాలు.. ఏపీలోనూ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో తెలుగుదేశం పార్టీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో టీడీపీ ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటుందా అన్న చర్చ ఇప్పటికే జరుగుతోంది. అయితే టీడీపీ మాత్రం ఎవరితో పొత్తులు ఉండవని చెబుతోంది. బీజేపీ కూడా ఎలాంటి పొత్తులు ఉండవని ప్రకటించింది. మరో వైపు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ ఏపీలోనూ శాఖను ప్రారంభించారు. త్వరలో ఏపీలో బహిరంగసభ పెట్టాలనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking