Take a fresh look at your lifestyle.

జీవన్ రెడ్డి స్వయం కృతాపరాదం..

కేసీఆర్ ప్రభుత్వంలో ఆడిందే ఆట.. పాడిందే పాట..

0 1,963

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ లే..

రేవంత్ రెడ్డి సీఎం కాగానే ప్రారంభమైన కష్టాలు..

– అనుచరులంతా కాంగ్రెస్ లోకి..

– లోక్ సభ ఎన్నికలలో ఎదురు దెబ్బ తప్పదా..?

– హైదరాబాద్ లోని వివాదాస్పద భూములపై విచారణ..?

– జీవన్ రెడ్డి మాల్ ను స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ..

(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)

ఆశన్నగారి జీవన్ రెడ్డి.. ఇతను ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే. కేసీఆర్ ప్రభుత్వంలో ఎదురులేని ప్రజా నాయకుడు.. అందరూ కేసీఆర్ దత్తపుత్రుడిగా భావిస్తారు. అంతే.. ఆ పదేళ్లు సీఎంగా కేసీఆర్ ఉన్నంత కాలం అతని జోలికి వెళ్లడానికి అధికారులు సహసించలేరు.

రాజకీయంగా అతనికి ఎదురు తిరుగడానికి ప్రయత్నిస్తే జీవన్ రెడ్డి ఆగ్రహానికి బలి కావాల్సిందే. ఇదంతా గతం.. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు మారినవి. సీఎంగా రేవంత్ రెడ్డి అయ్యారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని విర్రవీగిన జీవన్ రెడ్డికి ఇప్పుడన్నీ షాక్ లే స్వాగతం పలుకుతున్నాయి.

జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం..

ఔను.. మీరు చదివింది నిజమే.. ఆర్టీసీ అధికారులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై అవినీతి ఆరోపణలు చేసిన వారం రోజులకే జీవన్ రెడ్డికి షాక్ ఇచ్చారు అతను. హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి బకాయిలు పూర్తిగా చెల్లించలేదనే కారణంతో మాల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్టీసీ సంస్థ ప్రకటించింది.

రేవంత్ రెడ్డి సీఎం కాగానే…

కేసీఆర్ ప్రభుత్వంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పొలిటికల్ అటాక్ చేసిన ముఖ్యులలో ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక్కరు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన రోజే జీవన్ రెడ్డి మాల్ కు నోటీసులు ఇచ్చి దండోరా వేయించింది ఆర్టీసీ సంస్థ. అప్పటి వరకు తనకు తిరుగులేదని భావించిన జీవన్ రెడ్డికి తగిలిన మొదటి షాక్ అదే.. దీంతో ప్రజలలో పలుచనైన జీవన్ రెడ్డి తొలివిడతలో కోటి 50 లక్షలు.. రెండోసారి 2 కోట్ల 40 లక్షలు, మూడోసారి 2 కోట్ల బకాయిలను జీవన్ రెడ్డి చెల్లించారు. అయినా.. మిగతా 2 కోట్ల 51 లక్షల బకాయాలు చెల్లించ లేదనే కారణంతో సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జోష్ పెంచారు. జీవన్ రెడ్డి మాల్ ను గురువారం స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.

అధికారం పోవడంతో కష్టాలు..

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టాలు ప్రారంభమయ్యాయి. రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలువాలని అసేంబ్లీకి పోటీ చేశారు. పదేళ్ల కాలంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఒకే ఒక్కడులా వ్యవహరించి అడ్డు వచ్చిన వాళ్లను అణిచిన జీవన్ రెడ్డి మారిన రాజకీయాలలో ఏకాకిగా మారారు. అతని వెంట ఉన్న అనుచర గణమంతా అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. లోక్ సభ ఎన్నికలలో ప్రచారానికి వచ్చిన సందర్భంలో అన్న – తమ్ముడు మాత్రమే కారులలో కనిపించారు.

అనుచరులంతా కాంగ్రెస్ లోకి..

ఒకప్పుడు జీవన్ రెడ్డి ఆర్మూర్ వస్తున్నారంటే పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, అనుచరులంతా ఇంటి వద్ద పడి గాపులు కాచే వారు. కానీ.. ఓడిన ఎమ్మెల్యేగా అతని వెంట ఎవరు లేకుండా పోయారు. జడ్ పిటిసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి పోవడంతో జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది.

లోక్ సభ ఎన్నికలలో..

లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసిన బీఆర్ ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు ఆర్మూర్ నియోజక వర్గం నుంచి అతి తక్కువ ఓట్లు పోలాయ్యే అవకాశం ఉంది. లోక్ సభకు పోలైన ఓట్ల తీరును పరిశీలిస్తే మూడవ స్థానంలోకి పడి పోతుందానేది టాక్. దీంతో జీవన్ రెడ్డికి ఈ లోక్ సభ ఎన్నికల వచ్చే ఓట్లు కూడా దెబ్బనే.

వివాదాస్పద భూములపై దృష్టి..

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్, నిజామాబాద్ లలోని వివాదా స్పద భూములపై ప్రభుత్వం కన్ను పెట్టినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమ భూములను అక్రమించుకున్నారని సామ దామోదర్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం విధితమే. కేసీఆర్ ఫ్యామిలీ అండతో తమకు అన్యాయం చేశారని అతను ఆరోపణలు చేశారు. అయితే.. జీవన్ రెడ్డిపై గుర్రు మీద ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అతని వివాదా స్పద భూములపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకోవడం వెనుక సీఎం ఆదేశాలున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking