Take a fresh look at your lifestyle.

లవర్ ను లవ్ చేస్తున్నాడని ఫ్రెండ్ ను మర్డర్..

0 401

క్రైమ్ సెంటర్ గా నిజామాబాద్

నిజామాబాద్, మార్చి 3, అబ్దుల్లాపూర్ మెట్ లో ఓ యువతి కోసం స్నేహితుడిని అది కిరాతకంగా చంపిన ఘటన మర్చిపోక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోనూ అబ్దుల్లాపూర్ మెట్‌ తరహా ఘటన ఒకటి జరిగిందని నిర్ధారించారు. అయితే, ఇది దాదాపు ఐదు నెలల క్రితం జరగ్గా, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

అబ్దుల్లాపూర్ మెట్ హత్య ఉదంతం సంచలనం రేపి, రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశం అయిన దరిమిలా, నిజామాబాద్ జిల్లాలో జరిగిన పాత హత్య బయటకు వచ్చింది. తాను ప్రేమించిన అమ్మాయిని ఇంకో వ్యక్తి ఇష్టపడుతున్నాడనే కోపంతో స్నేహితుడిని అత్యంత దారుణంగా ఓ యువకుడు హతమార్చాడు. అయిదు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నందిపేట పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

నందిపేట మండల పరిధిలోని ఆంధ్రానగర్‌ పంచాయతీ పరిధిలో ఏపీలోని వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అక్కడే చిన్న వెంకట రమణ కుటుంబం కూడా నివాసం ఉంటోంది. వెంకటరమణ కుమారుడు కార్తీక్‌(22), అక్కడే ఉండే బాపట్ల రాజు (22) ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి స్థిరపడ్డ ఓ యువతి అప్పుడప్పుడు రాజు ఇంటికి వస్తుండేది. అలా రాజుతో ప్రేమలో పడింది. మరోవైపు, కార్తీక్‌కు కూడా ఆమె తెలుసు. ఇతను కూడా ప్రేమగా మార్చుకున్నాడు. ముందుగా ఆ యువతిని ప్రేమించిన రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

కానీ తన స్నేహితుడు కార్తీక్ కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని రాజుకు తెలిసింది. ఈ విషయం తెలిసి రాజుకు కార్తీక్‌పై కోపం వచ్చింది. తనకు కాబోయే భార్యను ప్రేమిస్తున్నాడని అతనిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా తన ప్రేమకు, పెళ్లికి అడ్డుగా వస్తున్న కార్తీక్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆ కుట్రలో భాగంగా తన తమ్ముడు హరీశ్‌తో కలిసి కార్తీక్‌ను చంపడానికి కుట్ర పన్నాడు.

ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 20, 2022న నందిపేట్ శివారులోని ఎల్లమ్మ గుడి వద్దకు ముగ్గురూ కలిసి వెళ్లి మద్యం సేవించి, కార్తీక్‌కు ఎక్కువ మందు తాగించారు. అలా మత్తులో ఉన్న కార్తీక్‌ను విజయనగరం గుట్ట దగ్గరికి తీసుకువెళ్లి తలపై కర్రతో తీవ్రంగా కొట్టారు. కార్తీక్ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత విజయనగరం గుట్ట ప్రాంతంలో రాళ్ల మధ్య కార్తీక్ మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు.

ఆ తర్వాత కొద్దిరోజులకు ఆ యువతిని రాజు పెళ్లి చేసుకున్నాడు. కార్తీక్ కనిపించకపోవడంతో అతడి కుటుంబం బతుకుదెరువు కోసం ఏపీకి వెళ్లి ఉంటాడని భావించింది. అబ్దుల్లాపూర్ మెట్ ఘటన వెలుగులోకి వచ్చాక, అలాంటి ఘటనే తమ ఊళ్లోనూ జరిగిందని గ్రామంలో అందరూ మాట్లాడుకుంటుండగా ఆ మాట వెంకటరమణను చేరింది.

కార్తీక్‌ను చంపేసి ఉంటారని అనుమానం కలిగింది. కార్తీక్ కుటుంబం పోలీసులకు సమాచారం అందించగా.. గుట్ట ప్రాంతంలో పరిశీలించగా ఓ అస్థి పంజరం కనిపించింది. ఆ అస్థిపంజరానికి పోస్టు మార్టం నిర్వహించగా, పోస్టుమార్టం నివేదికలో ఆ అస్థిపంజరం కార్తీక్‌దే అని నిర్ధారణ అయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేయగా రాజు, హరీశ్‌ ఈ పని చేసినట్లుగా తేలింది. పోలీసులు తమ గురించి వెతుకుతున్నారని గ్రహించిన నిందితులు రాజు, హరీశ్ పారిపోయారు. వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking