Take a fresh look at your lifestyle.

భారత పర్యాటకాభివృద్ధికి -విజిట్ ఇండియా 2023

0 60

భారత పర్యాటకాభివృద్ధికి

‘విజిట్ ఇండియా 2023’ నినాదం

– ఎనిమిదిన్నరేళ్లలో పర్యాటక రంగంలో మౌలిక వసతుల అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టిసారించామన్న కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

– పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రోత్సహించేందుకు ఏప్రిల్ లో ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’

– జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన కిషన్ రెడ్డి

– 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా మనందరి కార్యాచరణ ఉండాలని సూచన

రణ్ ఆఫ్ కచ్ (గుజరాత్) : కరోనానంతర పరిస్థితుల్లో భారత దేశ పర్యాటకాన్ని పూర్వస్థితికి తీసుకురావడంతోపాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి పెరిగేలా కేంద్ర ప్రభుత్వం మౌలికవసతుల కల్పనతోపాటుగా వివిధ కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలో పర్యాటక అభివృద్ధికి ‘విజిట్ ఇండియా-2023’ నినాదంతో ముందుకెళ్తున్నామన్న కేంద్ర మంత్రి.. ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రైవేటు రంగం, ఇతర భాగస్వామ్య పక్షాలు, ప్రజలు కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు.

బుధవారం జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన కిషన్ రెడ్డి.. ఉపాధి కల్పనకు విస్తృతమైన అవకాశం ఉన్న పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా అన్ని జీ20 సభ్యదేశాలు కృషి చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.

భారతదేశ పర్యాటక రంగ సామర్థ్యాలను గురించి వివరిస్తూ.. భారతదేశం ఓవైపు ప్రకృతి రమణీయత కలిగిన పర్వాతాలు, అందమైన బీచ్ లు, నదులు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నిర్మాణాలు.. మరోవైపు, చక్కటి వన సంపద, రాయల్ బెంగల్ టైగర్, గిర్ సింహాలు, ఒంటికొమ్ము రైనోలు వంటి వివిధ వన్యప్రాణులు, వివిధ భాషలు, వివిధ సంస్కృతులకు కేంద్రమని ఆయన అన్నారు.

40 యునెస్కో చారిత్రక కేంద్రాలు, 14 యునెస్కో ఇన్ టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఎలిమెంట్స్, ఆధ్యాత్మిక కేంద్రంగా, 4 ధర్మాలకు పుట్టినిల్లుగా (హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం, జైనిజం), ఎన్నో రకాల పండగలు, ఉత్సవాలకు కేంద్రంగా భారత్​ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును పొందిందన్నారు. దేశంలో ఏదో ఒకమూల ఎప్పుడూ ఒక పండగ జరుగుతూనే ఉంటుందన్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో పర్యాటకాన్ని వృద్ధి చేసేందుకు గత ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు 7వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీంతోపాటుగా దేశంలో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు స్వల్పకాల హాస్పిటాలిటీ కోర్సులు, స్కిల్ టెస్టింగ్ సర్టిఫికేషన్స్, వివిధ కార్యక్రమాల కోసం డిజిటల్ కోర్సులు ఏర్పాటు చేయడం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన పేర్కొన్నారు. రేపటి పౌరుల్లో పర్యాటక స్పృహను పెంచేందుకు యువ టూరిజం క్లబ్ లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

దీంతోపాటు దేశంలో పర్యటించే దేశీయ, విదేశీ పర్యాటకుల భద్రత కోసం పత్ర్యేకంగా యూనిఫామ్ టూరిజం పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటుగా పర్యాటక ప్రాంతాల అనుసంధానతను మెరుగుపరచడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్’ (అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల సంపూర్ణ సమన్వయం)తో ముందుకెళ్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ పరుషోత్తం రూపాలా, గుజరాత్ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ మును భాయ్ బేరా, గుజరాత్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్, కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ తోపాటు జీ-20 సభ్యదేశాలతోపాటు ఇతర ఆహ్వానిత దేశానుంచి వచ్చిన ప్రతినిధులు, భారతదేశంలో పర్యాటక రంగం భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking