Take a fresh look at your lifestyle.

పర్యాటకాభివృద్ధిలో సినిమాల పాత్ర కీలకం : కేంద్ర మంత్రి

0 16

పర్యాటకాభివృద్ధిలో సినిమాల పాత్ర కీలకం

సినిమాల్లో చూపించే ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి

కేంద్ర పర్యాటక మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

శ్రీనగర్, మే 22 : పర్యాటక రంగ అభివృద్ధిలో సినిమాలు పోషించే పాత్ర కీలకమని కేంద్ర పర్యాటక శాఖమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సినిమాల్లో చూపించే ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు పర్యాటకులను ఆకర్శిస్తాయని ఆయన అన్నారు. కశ్మీర్ ప్రకృతి అందాలను చూపించే చిత్రాల ద్వారా ఇక్కడి పర్యాటకం పెరిగిన సందర్భాలను కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

కశ్మీర్‌లోని శ్రీనగర్ లో రెండ్రోజులపాటు జరగనున్న జీ20 సమావేశాలను పురస్కరించుకుని సైడ్ ఈవెంట్ గా ‘ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనమిక్ గ్రోత్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్’ థీమ్ పై నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ దేశాల్లో పర్యాటక రంగంలో సినిమాల పాత్రకు సంబంధించిన పాలసీలు, ఉత్తమ పద్ధతుల మార్పిడి తదితర అంశాలకు ఇదొక చక్కని వేదికన్నారు.

భూతల స్వర్గమైన శ్రీనగర్ ప్రకృతి రమణీయత గురించి ప్రాచీన కాలం నుంచి ఎంతో గొప్పగా వివరించేవారని, అలాంటి కశ్మీర్‌లో సినిమాలు తీసేందుకు గొప్ప గొప్ప ఫిల్మ్ మేకర్లు ఆసక్తి చూపించేవారన్నారు. కశ్మీర్‌తోపాటు వివిధ రాష్ట్రాల్లోని అద్భుతమైన సందర్శనీయ స్థలాల్లో తరచుగా సినిమా షూటింగ్‌లు జరుగుతాయన్నారు. భారతదేశంలో ప్రకృతి వైవిధ్యత కారణంగా ఇక్కడ సినిమాల ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు.

ఎత్తయిన పర్వతాలు, అందమైన రంగురంగుల పూల లోయలు, సముద్ర తీర ప్రాంతాలు, సముద్రాలు-నదులు, చల్లటి-వేడి ఎడారులు, వివిధ మతాల విశ్వాసాలకు సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రాలు, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ప్రకృతి సౌందర్య ప్రాంతాలతోపాటుగా మన వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల వంటివెన్నో చిత్రాల నిర్మాణానికి ఉపయోగపడతాయన్నారు.

వీటితోపాటుగా భారతదేశంలో నైపుణ్యం కలిగిన సినిమా టెక్నీషియన్స్, అత్యాధునిక వసతులున్న పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ వంటివి జాతీయ, అంతర్జాతీయ చిత్రాల నిర్మాణానికి భారతదేశాన్ని ఓ అవకాశంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత పర్యాటక రంగ అభివృద్ధితోపాటు మన సాంస్కృతిక పరిరక్షణకోసం కేంద్ర పర్యాటక శాఖ ఓ సమగ్రమైన ప్రణాళికను రూపొందింస్తోందని ఆయన వెల్లడించారు.

ఇటీవల భారతదేశం రెండు ఆస్కార్ అకాడెమీ అవార్డులను గెలుచుకున్న సందర్భాన్ని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ.. ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా, ‘ద ఎలిఫెంట్ విస్పర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయన్నారు. నాటు నాటు పాట చిత్రం RRR నటుడు, శ్రీ రామ్ చరణ్ తేజ మన మధ్యే ఉన్నారని కేంద్రమంత్రి ప్రస్తావించగా.. సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.

‘అతిథి దేవో భవ’ నినాదంతో ముందుకెళ్తున్న భారతదేశంలో ఆతిథ్యరంగం, రవాణా, మారుమూల ప్రాంతాలకు కూడా పెరుగుతున్న అనుసంధానత వంటివి ఫిల్మ్ మేకర్స్ కు మరింత సౌలభ్యాన్ని కలిగిస్తాయన్నారు. ప్రపంచ దేశాలన్నీ తమ పర్యాటక రంగాభివృద్ధిలో సినిమాల పాత్రను గుర్తించి ప్రోత్సహిస్తున్నాయి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీని ద్వారా ఆర్థిక ప్రగతితోపాటు ఉపాధి కల్పన కూడా పెరుగుతుందన్నారు.

అనంతరం, వివిధ దేశాల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఫిల్మ్ షూటింగ్స్ ను ప్రోత్సహిస్తున్న పాలసీలు, ఉత్తమ పద్దతులను ఆయా దేశాల ప్రతినిధులు పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింగ్, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్, జీ20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్, జీ20 కోఆర్డినేటర్ శ్రీ హర్షవర్ధన్ శ్రింగ్లా, పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్, జీ20 దేశాల ప్రతినిధులు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంఘాల ప్రతినిధులు, ప్రముఖ సినీనటుడు శ్రీ రామ్ చరణ్ తేజ, ప్రముఖ చిత్ర నిర్మాత శ్రీ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking