Take a fresh look at your lifestyle.

పాక్ ఉగ్రవాదులపై ఇండియా ఆర్మీ కన్ను

0 51

ఉగ్రమూలాలపై ముప్పేట దాడి

శ్రీనగర్, మార్చి 6, పాకిస్తాన్ దివాలా తీసింది. పాక్‌ అండదండలతో చెలరేగిపోయి భారత్‌పై దాడులకు తెగబడే ఉగ్రమూకలు ఇప్పుడు సాయమందక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఇదే మంచి సమయం అని భావిస్తున్న భారత ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టింది. పాకిస్థాన్‌లో ఉంటూ భారత్‌లో ఆరాచకం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు కళ్లెం వేసే పని చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్‌కు చెందిన కొందరు ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో కూర్చొని భారతదేశంలో అరాచకాలు సృష్టిస్తున్నారు.

ఇలాంటి వ్యక్తులు 168 మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది.ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని రోజువారీ ఖర్చులకు పాకిస్తాన్‌ తల్లడిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రమూకలకు ఆర్థిక సాయం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఉగ్రవాద నాయకులకు తమ శిక్షణా కేంద్రాలు నడిపించేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పాక్‌ నుంచి వచ్చే డబ్బుతో వారు ఇన్నాళ్లు ఇండియాలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో పాక్‌లో తిష్టవేసిన తీవ్రవాద నాయకులు కశ్మీర్‌లో ఉన్న తమ ఆస్తులు అమ్మాలనే ఒత్తిడి పెరుగుతోంది.

ఆ డబ్బుతో కొన్నాళ్ల పాటు మనుగడ సాగించాలన్నది ఈ తీవ్రవాద నేతల ఆలోచన.కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ, ఎన్ఐయేవంటి ఏజెన్సీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఉగ్రవాదులకు నిధులు అందే మార్గాలను దాదాపు మూసేశాయి. తాజాగా ఈ విధానంలో కొంత మార్పు చేస్తూ ఉగ్రవాదులకు చెందిన ఆస్తుల జప్తుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 90వ దశకం నుంచి పరారీలో ఉన్న ఉగ్రవాదులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించి చాలా కాలమవుతోంది. వీరందరిని యూయేపీయే చట్టం కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలకు దిగుతున్నట్టు స్పష్టమవుతోంది.ఇలా ప్రకటించిన ఉగ్రవాదుల పేర్లతో ఉన్న ఆస్తులను జప్తు చేస్తున్నారు. అలాగే వారు అక్రమంగా ఏదైనా ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టు అయితే వాటిని బుల్‌డోజ్‌ చేస్తున్నారు. ఈ ప్రక్రియ గతేడాది డిసెంబర్‌ 31న మొదలైంది.

దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ పహాల్‌గావ్‌ పరిధిలోని లీవర్‌ గ్రామానికి చెందిన కరుడుగట్టి ఉగ్రవాది గులాంనబీ ఖాన్‌ అలియాస్‌ అమీర్‌ ఖాన్‌ ఆస్తుల జప్తుతో ఈ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది.మార్చి మొదటి వారంలో ఈ చర్యలను కేంద్రం మరిన్ని కఠిన చర్యలు చేపట్టింది. ఉగ్రవాద సంస్థ అల్‌ ఉమర్‌ సంస్థ అధ్యక్షుడు ముస్తాక్‌ అహ్మద్‌కు శ్రీనగర్‌లో ఉన్న ఆస్తులను ఎన్ఐయే స్వాధీనం చేసుకుంది. ఆ ఆస్తులు తమ అధీనంలో ఉన్నాయని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. అలాగే బారాముల్లాకు చెందిన బాసిత్‌ రేషికి చెందిన ఆస్తులను కూడా ఎన్ఐయే జప్తు చేసింది. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం పాక్‌లో తలదాచుకుంటున్న భారత్‌కు చెందిన ఉగ్రవాదులే.హిజ్బుల్‌ ముజాహిద్దున్‌ సుప్రీమ్‌ సయ్యద్ సలావుద్దీన్‌ వంటి ప్రముఖ ఉగ్రవాదుల విషయంలోనూ ఈ తరహా చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

ఇలాంటి చర్య ఎప్పుడో చేపట్టాల్సిందని కశ్మీర్‌ సొసైటీ సంఘటన్‌ వంటి సంస్థలు అంటున్నాయి. ఆస్తుల యజమానుల్లో చాలా మంది 1947లోనే పాక్‌కు పారిపోయిన విషయాన్ని గుర్తు చేస్తోంది.ఈ తరహా ఉగ్రవాదుల సంఖ్య 168 వరకు ఉంటుందని జమ్ము కశ్మీర్‌ పోలీసులు చెప్తున్నారు. వీళ్లంతా పాక్‌కు పారిపోయి అక్కడి నుంచి ఇక్కడ అరాచకం సృష్టిస్తున్నారని అంటున్నారు. అలాంటి వారందరి సంపదను జప్తు చేసే ప్రక్రియ ఇప్పుడు మొదలుకాబోతోంది. మరో వైపు, ఏదో ఒక వంక చూపుతూ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం ఒక ప్రమాదకరమైన ధోరణి అని పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆరోపించింది. వివిధ ఏజెన్సీలు జప్తు చేస్తున్న ఆస్తులు చాలా వరకు నివాస గృహాలు ఉన్నాయని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking