Take a fresh look at your lifestyle.

పీలో తెలంగాణ- పిలావో తెలంగాణగా మార్చిన సీఎం కేసీఆర్

0 12

గల్లీగల్లీలో మద్యం ఏరులై పారుతుంది..

: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

హైదరాబాద్, మే 17 : తెలంగాణలో కేసీఆర్ ”తాగుడు-ఊగుడు” పథకంతో ”పీలో తెలంగాణ- పిలావో తెలంగాణ” నినాదంతో గల్లీగల్లీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నిజాం కాలేజీ మైదానంలో ”ఖేలో భారత్- జీతో భాగ్యనగర్” పేరిట నిర్వహించిన క్రీడల పోటీల ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన బండి సంజయ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నరేంద్రమోడీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని.. యూపీఏ హయాంతో పోలిస్తే క్రీడల బడ్జెట్ ను 8 రెట్లు అధికంగా కేటాయిస్తున్నారని తెలిపారు.

గతంలో క్రీడల్లో సెలెక్ట్ కావాలన్నా, అవార్డులు ఇవ్వాలన్నా పైరవీలు ఉండేవి. మోడీ వచ్చాక నైపుణ్యమే గీటురాయిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా రంగాల్లో రాణించిన వారికి మాత్రమే అవార్డులు ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కూడా కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు అని పేర్కొన్నారు.. తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్ల ప్రజా ధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు.

చివరకు బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కు దమ్ముంటే.. తన పాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధిపై శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మద్యంపై రూ.10 వేల కోట్ల ఆదాయమంటే కేసీఆర్ వచ్చాక రూ.40 వేల కోట్లకు చేరింది.. ఆ సంపాదన చాలదని బంపర్ ఆఫర్ పేరుతో మందు రేట్లు తగ్గించి తాగుడును మరింత ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. స్విగ్గి, జొమాటో మాదిరిగా ఇంటింటికీ మద్యాన్ని పంపిణీ చేస్తాడు అని ఆరోపించారు బండి సంజయ్‌..

ఇప్పటికే హుక్కా సెంటర్ల పేరుతో బానిసలను చేస్తున్నారు.. అనుమతి లేకపోయినా బీఆర్ఎస్ నేతల అండ ఉంటే ఎక్కడ పడితే అక్కడ హుక్కా సెంటర్లు పెట్టుకోవచ్చనేలా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడు.. ప్రజలను ఆదుకోడు.. సీఎం మళ్లీ పొరపాటున గెలిస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిస్తడు అంటూ విమర్శించారు. పంట నష్టోయిన రైతులు ఏడుస్తున్నరు. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు బాధపడుతున్నరు. నిలువ నీడ లేక పేదల అల్లాడుతున్నరు. కానీ, అవసరం లేకపోయినా సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టుకున్నడు. ప్రగతి భవన్ కట్టుకున్నడు..

ఇక్కడి ప్రజలను ఆదుకోవాలని చెబుతుంటే. పంజాబ్ పోయి అక్కడి రైతులకు పైసలిస్తడు.. మహారాష్ట్ర వాడికి ఉద్యోగాలిచ్చి లక్షల జీతాలు ఇస్తున్నడు. హైకోర్టు తిడితే ఏపీకి పారిపోయినోడిని పట్టుకుని వచ్చి మళ్లీ ఇక్కడ చీఫ్ అడ్వయిజర్ పోస్టులిచ్చారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడ లేని పేదలకు ఇండ్లు కట్టిస్తాం.. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యన్ని అందిస్తా.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం.. విద్యార్గులకు ఇబ్బంది లేకుండా ఫీజు రీయంబర్స్ మెంట్ అందిస్తాం అని ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking