Take a fresh look at your lifestyle.

మోడీని పలకరించిన అమెరికా అధ్యక్షులు బైడెన్‌

0 12

జీ-7 సదస్సులో వింత సంఘటన

మోడీని పలకరించిన అమెరికా అధ్యక్షులు బైడెన్‌

టోక్యో, మే 20,: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం జపాన్‌లోని హిరోషిమాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగే ప్రతిష్ఠాత్మక G-7 దేశాల సదస్సులో మోడీ పాల్గొంటున్నారు. కాగా ఈ సమ్మిట్‌లో భారత్‌, జపాన్‌లతో పాటు అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఇండోనేసియా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల అధినేతలు ఈ జీ-7 సదస్సుకు హాజరయ్యారు. కాగా జీ-7 సదస్సులో భాగంగా ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మంత్రి మోడీని పలకరించేందుకు స్వయంగా ఆయన ఉన్న వేదిక దగ్గరకు వచ్చారు అమెరికా అధ్యక్షులు బైడెన్‌.

దీనిని గమనించి మోడీ కూడా లేచి బైడెన్‌ను పలకరించారు. ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే ప్రఖ్యాత జపనీస్ రచయిత, హిందీ, పంజాబీ భాషావేత్త, పద్మశ్రీ డాక్టర్ టోమియో మిజోకామి, ప్రముఖ జపనీస్ చిత్రకారుడు హిరోకో తకయామాతో సమావేశమయ్యారు మోడీ. ప్రొఫెసర్ టోమియో మిజోకామి, హిరోకో తకయామాను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

అంతకుముందు హిరోషిమా పట్టణంలో జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి మోడీ. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దొరకడం తన అదృష్టమన్నారు . హిరోషిమా అనే పదం వింటేనే ఇప్పటికీ ప్రపంచం భయపడుతోందన్నారు. తాను జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హిరోషిమాలో నాటారని తెలిసి హర్షం వ్యక్తం చేశారాయన. ఇక్కడి మహాత్మాగాంధీ విగ్రహం అహింసా సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని మోడీ ఆకాంక్షించారు.

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ప్రత్యేకంగా భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ G-7 సమ్మిట్‌కు హాజరయ్యారు. జపాన్ ప్రధాని కిషిద ఆయనకు ఆహ్వానం పలికారు. జపాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలపైనే కాకుండా…అంతర్జాతీయ సమస్యల్నీ చర్చిస్తున్నారు. ముఖ్యంగా…పాక్, చైనాతో సరిహద్దు వివాదాలపై కీలక చర్చలు జరుగుతాయని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఇదే క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనా చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే…ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ అవుతారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే…రష్యా సైనిక చర్య తరవాత ఇద్దరు నేతలు కలవడం అదే తొలిసారి అవుతుంది. ఇప్పటికే ఇరు దేశాల దౌత్యవేత్తలు ఈ సమావేశంపై సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే…ఇంకా దీనిపై కన్‌ఫర్మేషన్ రాలేదు. రెండు వర్గాల అధికారులు ఇంకా చర్చ జరుపుతున్నట్టు సమాచారం. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్‌స్కీని కూడా జపాన్ ప్రధాని కిషిద G-7 సదస్సుకి ఆహ్వానించారు.

గత నెల ఉక్రెయిన్ డిప్యుటీ విదేశాంగ మంత్రి ఎమైన్ జపరోవా భారత్‌ పర్యటనకు వచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఏడాదిన్నర తరవాత ఉక్రెయిన్‌కి చెందిన ఓ లీడర్‌ భారత్‌కు రావడం అదే తొలిసారి. యుద్ధాన్ని ఆపడంలో సహకరించి “విశ్వగురు” అనిపించుకోవాలని అప్పట్లోనే ఆమె ప్రధానికి విన్నవించారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చారు ప్రధాని మోదీ. G-20 సదస్సులోనూ ఆయనతో మాట్లాడారు. ఈ విషయంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎటువైపూ నిలబడకుండా “శాంతినే కోరుకుంటున్నాం” అని చెబుతోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించీ ఓ ఇంటర్వ్యూలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్‌ స్టాండ్ ఏంటని ప్రశ్నించగా…ఆసక్తికర సమాధానమిచ్చారు. “భారత్ ఎప్పుడూ శాంతి వైపే నిలబడుతుంది” అని తేల్చి చెప్పారు. ఆ రెండు దేశాల యుద్ధం కారణంగా…కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని, వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటని వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్‌తో సమానంగా సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం కోసం ప్రధాని మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే లేఖ రాశారు.

భారత పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా ఏప్రిల్ 11వ తేదీన విదేశాంగ మంత్రి మీనాక్షి లేఖికి ఈ లేఖ అందజేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు తన లేఖలో అదనపు మందులు, వైద్య పరికరాలను పంపడానికి సహాయం చేయాలని భారతదేశాన్ని అభ్యర్థించారు. తమ దేశంలో చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులను పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తున్నట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి చెప్పారు, ఇది వేల మంది భారతీయ విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. భారత్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా మాట్లాడుతూ రష్యాకు అండగా నిలవడమంటే చరిత్రకు రాంగ్ సైడ్‌లో ఉండటమేనని, తమ దేశం భారత్‌తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking