Take a fresh look at your lifestyle.

 హైకోర్టు  ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే

0 12

 హైకోర్టు  ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 : వివేక హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన ఆర్డర్ అంటూ ఆక్షేపించింది. అన్‌ యాక్సెప్టబుల్ అంది. వాదనలు పూర్తైన తర్వాత హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది.

దీనిపై స్పందించిన అవినాష్ రెడ్డి న్యాయవాది ఇప్పటికిప్పుడు స్టే ఇస్తే తన క్లయింట్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది సుప్రీంకోర్టు. అనంతరం ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, రెండు రోజుల వాదనలు తర్వాత ధర్మాసనం మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఈ తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు.అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సునీత గురువారం సుప్రీంకోర్టును  ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్‌ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు.

ఇవాళ విచారణకు స్వీకరిస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి అరెస్టు వద్దని హైకోర్టు ఊరట కల్పించినా సీబీఐ విచారణకు మాత్రం వెళ్లాల్సిందేనంటూ స్పష్టం చేసింది. దీంతో వరుసుగా మూడు రోజుల నుంచి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. రెండు రోజులుగా సుదీర్ఘంగా అవినాష్ రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. అవినాష్ రెడ్డి రాజకీయ ఎంట్రీపైన కూడా సీబీఐ అధికారులు కూపీ లాగారు. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీల పైన కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

రూ.40 కోట్ల డీల్ పై అవినాష్ రెడ్డి పాత్ర ఏంటనేదానిపైన కూడా సీబీఐ అధికారులు ఆరా తీశారు. సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కొత్త విచారణ అధికారి వికాస్ సింగ్ కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై దర్యాప్తు జరపాలని అవినాష్ రెడ్డి కోరారు. వివేకా ఫోన్ లో ఉన్న వివరాలు బయట పెట్టాలని అవినాష్ కోరారు. వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ ను ఎందుకు విచారణ చేయడం లేదని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని, మరో వ్యక్తి ఉదయ్ కుమార్ ను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించారు.

బుధ, గురువారాల్లో ఉదయం చంచల్ గూడా జైలు నుంచి నిందితులను కస్టడీ లోకి తీసుకొని వాళ్లను కూడా సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటికే ఇద్దరినీ ఆరు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నిందితులతో ఉన్న పరిచయాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. సునీల్ యాదవ్ కు కోటి రూపాయలు ఇచ్చారని దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా చేసుకొని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking