Take a fresh look at your lifestyle.

దేంట్లో తెలంగాణ వెనకబడిందో మోదీ చెప్పాలి

0 73

కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుంది

: నిలదీసిన మంత్రి తలసాని

హైదరాబాద్ ఏప్రిల్ 8(వైడ్ న్యూస్) ;కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మోదీ అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాత్రమే మాట్లాడారన్నారు. తెలంగాణపై ఆయనకు ప్రేమలేదని, ఇందుకు గతంలో రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.

వందే భారత్‌ రైళ్లను మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని మోదీ అన్నారని, కేంద్రం ఏమిచ్చిందని అడ్డుకోవడానికని నిలదీశారు.అవినీతి గురించి మోదీ మాట్లాడుతున్నారని.. అదానీ అవినీతి సంగతేంటని ప్రశ్నించారు. శ్రీలంకలో అదానీకి వచ్చిన కాంట్రాక్టు ఎవరి ద్వారా వచ్చింది ? అదానీ మోసాలపై జేపీసీ వేయమంటే ఎందుకు వేయరన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి మోదీ నాతో చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ధి సాధించకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తోందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అవునో కాదో ..? మోదీయే చెప్పాలన్నారు. 24 గంటల కరెంట్ రాష్ట్రంలో ఉందో లేదో మోదీ చెప్పాలన్నారు. రెండుకోట్ల ఉద్యోగాల సంగతిపై మోదీ మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో లక్షా35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.అవినీతి కుటుంబ పాలన గురించి మాట్లాడే హక్కు మోదీకి ఉందా? అని నిలదీశారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు లేవా? బీజేపీ సీఎంలు అవినీతిలో కూరుకుపోతే విచారణలు ఎందుకు ఉండవన్నారు.

దేంట్లో తెలంగాణ వెనకబడిందో మోదీ చెప్పాలన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెలంగాణకు ఇచ్చారా ..? జాతీయ రహదారులు ఎవరన్నా వస్తాయన్నారు. అందులో మోదీ గొప్ప ఏముందన్నారు. దేశానికి తెలంగాణ సమకూరుస్తున్న ఆదాయం ఎంత? కేంద్రం నుంచి ఇచ్చింది ఎంత ..? కరోనాకు వ్యాక్సిన్ కూడా తానే కనిపెట్టాను అన్నట్టుగా మోదీ మాట్లాడుతారని, ప్రోటోకాల్ ఉల్లంఘనకు తెరలేపింది మోదీయేనన్నారు.

గతంలో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ను రావొద్దన్నారని, విభజన చట్టం హామీలపై మోదీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి కాదు.. కనీసం సికింద్రాబాద్‌కు ఏమైనా చేశారా ? అని నిలదీశారు. మోదీ బాధ్యతా రహిత్యంగా మాట్లాడరని, ఆయన మాట్లాడిన మాటలపై చర్చకు సిద్ధమన్నారు. ఎవరి వాదనలో బలమెంతో చూసుకుందాం అంటూ సవాల్‌ విసిరారు.

మోదీ మమ్మల్ని తిట్టాలనుకుంటే ఢిల్లీలో ఉండి తిట్టుకోవచ్చని.. దానికి హైదరాబాద్ రావాలా? అని ప్రశ్నించారు. మమ్మల్ని తిడితే ప్రజలే తిరగబడతారని, ప్రధాని వస్తే సీఎంలు స్వాగతం పలకాలని ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking