Take a fresh look at your lifestyle.

సీఎం ప్రైవేట్ సెక్రటరీగా మహారాష్ట్ర వ్యక్తి

0 15

సీఎం ప్రైవేట్ సెక్రటరీగా మహారాష్ట్ర వ్యక్తి శరత్ మర్కట్

ఏడాదికి రూ. 18 లక్షల జీతం.. పార్టీలో చేరినందుకు నజరానా

సంబంధిత జీవో 647 రహస్యం

తెలంగాణ నిరుద్యోగులను పట్టించుకునేది లేదు కానీ పరాయి వ్యక్తులకు ఇక్కడి ప్రజల సొమ్మును వినియోగిస్తారా?

బీఆర్ఎస్ విస్తరణ కోసం ప్రజాధనం దుర్వినియోగం

కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మే 6 : సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో నిరుద్యోగులను పట్టించుకునే తీరిక లేదు కానీ బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు నజరానాగా మహారాష్ట్ర వ్యక్తి శరత్ మర్కట్ ను సీఎం ప్రైవేట్ సెక్రటరీగా కొలువు ఇచ్చి..ఏడాదికి రూ. 18 లక్షల జీతం ఇస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

పరాయి వ్యక్తులకు పార్టీ కోసం పని చేసే వారికి తెలంగాణ ప్రజల సొమ్మును లక్షల జీతాల రూపంలో చెల్లిసున్నారని రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. బీఆర్ఎస్ విస్తరణ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్ పక్క రాష్ట్రంలో వాళ్ళను తెచ్చి పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఎవడి సొమ్మని ఏడాదికి రూ. 18 లక్షలు జీతం

మహారాష్ట్రకు చెందిన శరత్ మర్కట్ ను బీఆర్ఎస్ లో చేర్చుకుని సీఎంఓలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని ఆరోపించారు. అతడికి నెలకు 1 లక్షా 50 వేల జీతం ఇచ్చి ప్రైవేట్ సెక్రటరీగా పెట్టుకున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించిన జీవో నెం.647ను ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. ఈ జీవో పబ్లిక్ డొమైన్ లో ఎక్కడా లేదని చెప్పారు. ఎవడి సొమ్మని ఏడాదికి రూ. 18 లక్షలు అతనికి జీతం ఇస్తున్నారు అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.

అసలు సంగతి ఇది..

టీఆరెస్ ను బీఆరెస్ గా మార్చి పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ లో చేరుతున్నారనే పత్రికలు, మీడియా ప్రచారంతో కేసీఆర్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలను సైతం వదిలేసి బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఊదరగొడుతున్నారు. ఏప్రిల్ 10న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్, నివ్ దుంగే గ్రామానికి చెందిన శరద్ మర్కట్ అనే ఐటీ ఉద్యోగి బీఆర్ఎస్ లో చేరారు. శరద్ మర్కట్ రూ. 5 లక్షల వేతనం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరాడని పత్రికల్లో వచ్చిన వార్తలు మనం చూశాం. లక్షల జీతాన్ని వదిలేసి మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ ను అమలు చేసేందుకు ఇందులో చేరినట్టు బీఆర్ఎస్ నేతలు తెగ ప్రచారం చేసుకున్నారు.

కానీ అసలు సంగతి ఆ తరువాతే బయట పడింది. లక్షల జీతాన్ని వదిలేసి బీఆర్ఎస్ లో చేరాడని చెబుతున్న శరద్ మర్కట్ ను నెలకు రూ.1,50,000 జీతం ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రైవేటు సెక్రెటరీగా నియమిస్తూ మే 2న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన జీవో 647ను మాత్రం రహస్యంగా ఉంచింది. జీవో647ను రహస్యంగా ఉంచడం వెనక ఉన్న మర్మం ఏమిటి? ఈ విషయంలో తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు.

మరి లక్షలాది మంది నిరుద్యోగులకు ఏం ఇస్తారు?

పార్టీలో చేరినందుకు శరద్ మర్కట్ కు కేసీఆర్ నజరానాగా అతనికి ఉద్యోగం ఇచ్చారా?. మరి పేపర్ లీకేజీతో నష్టపోయిన లక్షలాది మంది నిరుద్యోగులకు కేసీఆర్ ఏం ఇస్తారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పరాయి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి పార్టీ కోసం ప్రజల సొమ్మును వినియోగిస్తుండని విమర్శించారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మహారాష్ట్రకు చెందిన వాళ్లకు జాబులిస్తుండని ధ్వజమెత్తారు రేవంత్. జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
మహారాష్ట్రకు చెందిన వారు బీఆర్ఎస్ లో చేరుతున్నారనేది ఓ నాటకమని విమర్శించారు రేవంత్. కిరాయి మనుషులను రప్పించి రోజుకో వేషం వేయించి పార్టీలో చేర్పించుకుంటున్నారని అన్నారు. పగటి వేషగాళ్లను రప్పించి బీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారనే ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

బీజేపీ లాభం చేసేలా కేసీఆర్ చర్యలు

కేసీఆర్ చర్యలు అంతిమంగా బీజేపీకి లాభం చేసే విధంగా ఉంటాయని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటే బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీని గెలిపించేందుకే కర్ణాటకలో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిజంగా బీజేపీని ఓడించాలని కేసీఆర్ అనుకుంటే మీడియా సమావేశం ఏర్పాటు‌చేసి బీజేపీని ఓడించాలని ప్రకటించాలంటూ కేసీఆర్‌ను ఆయన డిమాండ్ చేశారు.

భ్రమల్లో..కేసీఆర్

“కేసీఆర్ సచివాలయాన్ని ప్రయివేట్ ఎస్టేట్ అనుకుంటున్నాడు. అందుకే ప్రతిపక్షాలను, సామాన్యులను, మీడియా వారిని అనుమతించడం లేదు. కేసీఆర్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారు. 3 నెలలు ఆయన భ్రమల్లోనే ఉంటారు. తర్వాత ఆయన భ్రమలు తొలగిపోతాయి. బంగాళాలు మారినంత మాత్రాన కేసీఆర్ వంకరబుద్ది మారడం లేదు” అని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.

ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నిరసనలు

కర్ణాటకలో ఒడిపోతామన్న భయంతోనే బీజేపీ మా పార్టీ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడుతోంది. ఈ రకమైన పోకడలు తెలంగాణ రాజకీయ సంస్కృతి మంచిదా? బండి సంజయ్, కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇలాంటి చర్యలతో మీ గౌరవం తగ్గుతుంది తప్ప పెరగదు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిదే. లక్ష్మణ్, కిషన్‌రెడ్డి వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర హనుమాన్ చాలీసా చదువుకుందామని రేవంత్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో 40 శాతం కమీషన్ ప్రభుత్వం ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నేతలు ఇటువంటి నాటకాలాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

హిందూత్వ ముసుగులో చేసే రాజకీయాలకు తాము వ్యతిరేకమని ఆయన అన్నారు. 50 మంది కార్పొరేటర్లు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి ఏకీగ్రీవంగా ఎన్నికవుతున్న ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు మీ పార్టీ అభ్యర్ధిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టలేదు అని రేవంత్ రెడ్డి బీజేపీ నేతలను ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ నేతలు ఎంఐఎం తో కలిసిపోయారు. హనుమాన్ చాలీసా చదువుకోవాల్సింది కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అని ఎద్దేవా చేశారు. సచివాలయంలో నల్ల పోచమ్మ దేవాలయాన్ని కూల్చితే మాట్లాడని కిషన్ రెడ్డి హనుమాన్ చాలీసా గురించి మాట్లాడటం విడ్డూరం అని రేవంత్ విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking