హైదరాబాద్ నగరం నడిబొడ్డున
అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 14,: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆ పూల వర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నినదించారు.
అక్కడున్న ప్రజాప్రతినిధులంతా చప్పట్లతో పూల వర్షాన్ని స్వాగతించారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ టాంక్బండ్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు- సీఎం 2016లో ప్రకటించారు. దానికి అనుగుణంగా 2016 ఏప్రిల్ 14న ఎన్టీఆర్ పార్కు పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ కూడా చేశారు. 2017లో అప్పటి డిప్యూటీ- సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల బృందం చైనాలో పర్యటించింది.
పార్లమెంటు ఆకృతిలో నిర్మిస్తున్న బేస్మెంట్కు ఆగ్రా, నోయిడా, జైపూర్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన ఎరుపు, గోధుమ రంగుల రాళ్లను ఉపయోగించారు. విగ్రహంలోని బూట్లు కాళ్లు, చేతులు, భారత రాజ్యాంగం పుస్తకం, భుజాలు, ముందుకు చూపుతున్నట్లు ఉండే కుడిచేయి, తల తదితరాలన్నింటినీ విడివిడి భాగాలుగా నోయిడాలో కంచుతో తయారుచేసి లారీల ద్వారా తరలించారు. విగ్రహం పటిష్టంగా ఉండేందుకు లోపలివైపు స్టీల్ స్ట్రక్చర్ను ఉపయోగించారు. విడివిడి భాగాల మొత్తం అమరిక పూర్తయిన తర్వాత పాలీ యూరేథీన్ కెమికల్స్తో పాలిషింగ్ చేశారు. టాంక్బండ్ నీటి కాలుష్యంతో పాటు గాలిలోని రసాయనాల, వాతావరణ మార్పులతో విగ్రహం షైనింగ్ తగ్గకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అతి భారీ తుపానులను కూడా తట్టుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.