Take a fresh look at your lifestyle.

కేటీఆర్ – కవిత ఇద్దరు చెప్పేవన్నీ అబద్ధాలే

0 396

కవితను ఢిల్లీకి వెళ్లి లిక్కర్​ స్కామ్​ చేయమని ప్రజలు చెప్పారా?

–  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీ, మార్చి 9,  కల్వకుంట్ల కుటుంబం కేంద్ర ప్రభుత్వం, టార్గెట్​ చేసేంత గొప్పోళ్లు ఏమీ కాదని కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి అన్నారు. అన్నా చెల్లెలు ప్రెస్​మీట్​పెట్టి అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

‘‘కల్వకుంట్ల కుటుంబ ప్రతినిధులు దశల వారీగా ప్రెస్​మీట్లు పెడుతూ.. మేమే చాలా నీతిమంతులం.. మా మీద అక్రమ కేసులు పెడుతున్నరని అంటున్నారు. నోటికి ఏది వస్తే.. అది మాట్లాడుతున్నారు. వారి తీరు ఉల్టా చోర్​ కొత్వాల్​ దాటే అన్న సామెతను తలపిస్తున్నది. మీరు ఢిల్లీకి వెళ్లండి.. అక్కడ మద్యం స్కామ్​ చేసి డబ్బులు సంపాదించమని తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు ఏమైనా చెప్పారా? మీ అక్రమ వ్యాపారానికి, తెలంగాణ సమాజానికి ఎందుకు లింక్​ పెడుతున్నారు? మహిళలు చీదరించుకునేలా అక్రమ వ్యాపారం చేసింది మీరు. సీఎం బిడ్డ, ఒక మహిళ ఢిల్లీ నడిబొడ్డున అక్రమ వ్యాపారం చేసినందుకు తెలంగాణ పరువు పోయింది.

తెలంగాణలో మద్యం పెంచిపోషిస్తున్న ప్రభుత్వ పరంగా కేసీఆర్​ బెల్ట్​ షాపులు పెట్టి.. రాష్ట్ర ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పెట్టుకొని రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నది.

మహిళా రిజర్వేషన్​ బిల్లు కోసం మాట్లాడుతున్నాను కాబట్టి ఈడీ నోటీసులు ఇచ్చిందని చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్​ బిల్లుపై మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నదా?

కేసీఆర్​ మొదటి టర్మ్​లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. అలాంటి మీకు మహిళా రిజర్వేషన్​ గురించి ప్రశ్నించే హక్కు ఉందా? మీ మిత్ర పక్షం.. మజ్లిస్ పార్టీని మీరు ఒప్పించారా? ఆర్జేడీ, ఎస్పీ లాంటి మీ మిత్ర పక్షాలే కదా మహిళా రిజర్వేషన్​ బిల్లును అడ్డుకున్నయి. మద్యం కేసులో అరెస్ట్​ కాబోతున్నారని తెలిసే.. మహిళా రిజర్వేషన్​ పేరుతో కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెరలేపింది. సానుభూతి కోసం చేస్తున్న డ్రామా ఇది. రాజ్యసభకు ఒక్క మహిళను కూడా పంపని మీకు మహిళ గురించి మాట్లాడే హక్కు ఉన్నదా? శాసనమండలిలో ఎంత మందికి అవకాశం ఇచ్చారు? వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించండి, మా ఇంటికి రండి లాంటివి కవిత మాట్లాడుతున్నారు.

ఈ దేశంలో సీఎం బిడ్డలకు, సామాన్యులకు ఒక చట్టం ఉంటుందా? మీరు నీతివంతులైతే, మీరు అక్రమ వ్యాపారం చేయనట్లయితే.. ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎందుకు లక్షలు విలువ చేసే సెల్​ఫోన్లను ధ్వంసం చేశారు? జవాబు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం, మోడీ టార్గెట్ చేసేంత గొప్పొళ్లు కాదు మీరు. అక్రమ వ్యాపారం చేసింది మీరు.. దానిపై దర్యాప్తు చేస్తే తప్పు నరేంద్ర మోడీదా?

తెలంగాణ సమాజంలో మీకు వ్యతిరేకత వస్తున్నది. తెలంగాణ సమాజం మీ కుటుంబ పాలన పోవాలని కోరుకుంటున్నది. ఎవరి వద్దన్నా? కాదాన్నా? ఎవరు ధర్నా చేసినా.. కచ్చితంగా అవినీతికి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చానళ్లను బ్యాన్​ చేయడం, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం కల్వకుంట్ల ఫ్యామిలీకి అలవాటు”అని ఆయన మండిపడ్డారు

తప్పు చేసినపుడు దర్యాప్తు సంస్థలు విచారించడం సహజమేనని, ఆ విచారణను ఎదుర్కొనాలి తప్ప మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు కవితకు, కల్వకుంట్ల కుటుంబానికి లేదన్నారు.

ముఖ్యమంత్రి కుమారుడు కూడా తెల్లారి లేస్తే బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆ కుటుంబానికి, ఆ పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్న సందర్భంలో.. ఏం చేయాలో తోచకే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు సరైన బుద్ధి చెబుతారన్నారు.
2014లో అవినీతి వ్యతిరేక, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే నినాదంతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని.. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని కేంద్రమంత్రి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking