Take a fresh look at your lifestyle.

జీవన్ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి

0 13

ఆర్మూర్ అభివృద్ది మాకు వదిలెయ్యండి.. జీవన్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించండి
ఆర్మూర్ ప్రాంత అభివృద్ధికి నా వంతు సహకారం ఎప్పుడూ అందిస్తా

– ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ఆర్మూర్. మే 26 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి తో పాటు మాజీ స్పీకర్, ఎమ్మెల్సి మధుసూదనచారి,జడ్పీ చైర్మన్ విఠల్ రావు,రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి,మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్, కోటపాటి నర్సింహ నాయుడు పలువురు బి ఆర్ ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా బిఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.
సీఎం కేసిఆర్ సహకారంతో ఎమ్మెల్యే,పి యుసి చైర్మన్ జీవన్ రెడ్డి అధ్వర్యంలో వందల కోట్లతో ఆర్మూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఒక్క నంది పేట మండల మీటింగ్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ ను తలపిస్తోందని అన్నారు. ఉద్యమ సమయంలో నందిపేట లో 50 మంది మాత్రమే టిఆర్ఎస్ సభ్యులు ఉండేవారని,నేడు 3వేల మంది అయ్యారని గుర్తు చేశారు. మండల బిఆర్ఎస్ బలం ఇక్కడికి వచ్చిన బిఆర్ఎస్ శ్రేణులను చూస్తేనే తెలుస్తుందన్నారు. కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకారం అందించకున్నా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఎదిగిందని వివరించారు.

ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిని మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని,ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడని దుయ్యబట్టారు. 15 ఏళ్ల కింద 2జి స్పెక్ట్రం 1.70లక్షల కోట్లకు అమ్ముడు పోతే వేలంలో అవినీతి జరిగిందని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ ఆరోపణలు చేశారని, అంతకు రెట్టింపు టెక్నాలజీ అయిన 5జి స్పెక్ట్రం వేలం ఇప్పుడు కేవలం 1.40 లక్షల కోట్లకే తన మిత్రులు అదానీ,అంబానీ కి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఇందులో 15లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని,మిత్రుడు అదానీ స్వలాభం కోసం ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి పేరుతో 3వేలకు దొరికే బొగ్గును 30వేలకు కొనాలని విద్యుత్ డిస్కంలకు హుకుం జారీ చేశారని మండిపడ్డారు.ఇందులో 3లక్షల కోట్ల కుంభ కోణం జరిగిందని మంత్రి ఆరోపించారు. ఎల్ఐసి,ఎస్బిఐ,విమానాశ్రయాలు,ఓడరేవులు,ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ తన కార్పొరేట్ మిత్రులకు అప్పనంగా కట్టబెడుతూ దేశ సంపద దోచి పెడుతున్నాడని అన్నారు. మోడీ వల్ల దేశంలో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ రైతు బంధు,రైతు భీమా,ఆసరా పెన్షన్లు,కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్,కుల వృత్తులకు ప్రోత్సాహకాలు ఇలా అనేక పథకాలు ఇస్తూ ప్రజల ఇంట్లకే నేరుగా డబ్బులు పంపిస్తుంటే… ప్రధాని మోడీ ఏమో..పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్,పప్పు,ఉప్పు నిత్యావసర ధరలు పెంచి ఇంట్లో ఉన్న పైసలు గుంజుకొని సామాన్య ప్రజలను గోస పెడుతున్నడని మండిపడ్డారు. బీజేపీ మోడీ పాలనలో దేశం అదోగతి పాలయ్యిందన్నారు. తెల్లారితే కేసిఆర్ ను విమర్శించే బండి సంజయ్ అసలు కేసిఆర్ పాలన గురించి మాట్లాడే అర్హతనే లేదని తేల్చి చెప్పారు. కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు పేరుతో బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసి గెలిచిన ఎంపి అరవింద్ పత్తాలేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. కేసిఆర్ నాయకత్వంలో జనరంజక పాలన అందుతుందని,కేసిఆర్ తోనే దేశంలో,రాష్ట్రంలో అభివృద్ది సాధ్యమవుతుందని మంత్రి వేముల స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking