నిమ్స్ లో 1571 కోట్లతో 2000 పడకల ఆస్పత్రి
శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 14 : నిమ్స్లో కొత్తగా నిర్మించబోయే బ్లాక్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఏర్పాటు చేసిన ఈ బ్లాక్కు దశాబ్ధి బ్లాక్ అని పేరు పెట్టారు. ఈ బ్లాక్ ఏర్పాటుతో నిమ్స్లో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టారు. భవిష్యత్తులో పెరుగనున్న రద్దీ, విస్తృతం కానున్న స్పెషాలిటీలను దృష్టిలో పెట్టుకొని విస్తరణ పనులు జరగనున్నాయి. మూడు బ్లాకులు ఈ కొత్త దశాబ్ధి భవనం నిర్మించనున్నారు. 8 అంతస్థుల్లో ఓపీ బ్లాక్, ఎమర్జెన్సీ సేవలకు 8 అంతస్థుల బ్లాక్, ఇన్పేషంట్ల కోసం 13 అంతస్థులతో బ్లాక్ సిద్ధం చేయనున్నారు. కొత్త భవనంలో 30 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయని తెలుస్తోంది.
2 వేల పడకి కూగా ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. ఇందులో 1,200 ఆక్సిజన్ బెడ్లు, 500 ఐసీయూ బెడ్లు ఉంటాయి. ప్రత్యేక గది కావాలనుకునే రోగుల కోసం కొత్తగా 300 పేయింగ్ రూమ్స్ కేటాయిస్తారు. ప్రస్తుతం 30 విభాగాలు ఉండగా.. విస్తరణతో వీటి సంఖ్య 35 కానుంది. నిమ్స్కు కేసీఆర్ ప్రభుత్వం 2014-15లో 185 కోట్లు కేటాయించారు. తర్వాత 2022లో 242 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. ప్రస్తుత ఏడాది రూ.290 కోట్లు కేటాయించారు. 2014 నాటికి నిమ్స్లో 900 పడకలు మాత్రమే ఉండేవి. తర్వాత ఆ సంఖ్యను ప్రభుత్వం 1489కి పెంచింది.
ఇప్పుడు మరో 2000 పడకల నిర్మాణానికి పనులు ప్రారంభం అయ్యాయి. 2014 నాటికి 111 మంది మాత్రమే టీచింగ్ స్టాప్ ఉండే వాళ్లు. గతేడాది మరో 150ని నియమించారు. ఇప్పుడు అక్కడ బోధనా సిబ్బంది 264కు చేరింది. రెసిడెంట్ డాక్టర్ల కేటాయింపును కూడా పెంచారు. ప్రస్తుతం 169 మందిని కేటాయిస్తున్నారు. 2014 -2021 మధ్య నిమ్స్లో 90 కోట్ల రూపాయల విలువైన పరికరాలను కొనుగోలు చేశారు. 2022లో మరో రూ.153 కోట్ల పరికరాల కోసం ఆర్డర్ ఇచ్చారు.
2014తో పోల్చితే ఓపీ 26%, ఐపీ 91% పెరిగాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. నిమ్స్ ఆరోగ్యశ్రీ కింద లక్షన్నర మంది లబ్ధిపొందారు. 32 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 6 మేజర్ మాడ్యులర్ థియేటర్లు దీనిలో నిర్మించనున్నారు. మొత్తం మూడు బ్లాకులలో నిమ్స్ టవర్ నిర్మించనున్నారు. శంకుస్థాపన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..వైద్యానికి, మానవజీవితానికి ఎడతెగని బంధం ఉన్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్ వచ్చే అవకాశముందని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు వివరించారు.మానవజాతి ఉన్నన్ని రోజులు వైద్య రంగం ఉండాల్సిందే.. 2014లో 2వేల కోట్ల బడ్జెట్ అయితే, 2023లో 12వేల కోట్లు వైద్యశాఖకు కేటాయింపులు జరిపినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని అడుక్కోకుండా ఆక్సిజన్ మనమే తయారు చేసుకుంటున్నామన్నారు. వందల పడకల ఆసుపత్రులను.. వేల సంఖ్యకు పెంచుకున్నామన్నారు.
రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్ లు వస్తాయి.. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎదురైనా ఎదురుకునేందుకు తెలంగాణ వైద్యశాఖ రెడీగా ఉందంటూ సీఎం స్పష్టంచేశారు. బెస్ట్ ప్లానింగ్ ఆఫ్ సక్సెస్ అనే నినాదం ఉన్నత వైద్యాధికారులు మర్చిపోవద్దంటూ కోరారు. వైద్యారోగ్య శాఖలో పీఆర్ తక్కువ అందుకే విమర్శలు వచ్చిపడుతున్నాయి. వైద్యోనారాయనో హరి అంటారు.. IAS లు అయినా ముఖ్యమంత్రి అయినా రోగం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే.
పోలీస్ ప్రొఫైల్ ను పూర్తిగా మార్చి.. ఫ్రెండ్లీ పోలీస్ గా మార్చాము. వైద్యశాఖ ప్రజలకు చేసే సేవ ప్రజలకు తెలిసేలాగా పీఆర్ పెంచాలి. వైద్యారోగ్యశాఖ లో ప్లానింగ్ ఇంకా బాగా మెరుగ్గా ఉండాలంటూ సూచించారు. కొత్త భవనాలు, నూతన ఈక్విక్మెంట్ తేవడం కాదు అది ప్రజలకు ఉపయోగపడాలని.. కరోనా లాంటి మహమ్మారి మళ్ళీ వచ్చినా ప్రజలకు మేమున్నాం అనే ధైర్యం డాక్టర్లు ఇవ్వాలని పేర్కొన్నారు. డాక్టర్లు పనిచేయడం లేదనే విమర్శ ఉందని.. అది తొలిగిపోయేలా మీ పనితీరు మార్చుకోవాలంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.