రాజీవ్ విగ్రహం ఆవిష్కరించి, కేసీఆర్ కు మాస్ వార్నింగ్
ఆ గాడిదలకు బుద్ది లేదు.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టి చూడండి బిడ్డా.. ఎవడు వస్తాడో రండి.. నేను చూస్తా. రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా
నిర్దేశం, హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలపై రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని.. రాష్ట్రాన్ని కాపాడేది కూడా తామేనని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే.. దాన్ని తీసేస్తామని బీఆర్ఎస్ నేతలు అంటుండడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంప్యూటర్ తెచ్చింది రాజీవ్ గాంధీ
త్యాగం అంటేనే సోనియాగాంధీ అని రేవంత్ అన్నారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని అన్నారు. ‘‘ట్విటర్ పిట్ట అయిన కేటీఆర్ కు కంప్యూటర్ తెచ్చిందే రాజీవ్ గాంధీ కదా. లేకపోతే గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వాడు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి అయ్యాడు అంటే అది రాజీవ్గాంధీ చలవే. పదవులు, ప్రాణ త్యాగం అంటే గాంధీ కుటుంబం మాత్రమే గుర్తుకు వస్తుంది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఎవడు వస్తడో రండి
‘‘ఆ గాడిదలకు బుద్ది లేదు.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టి చూడండి బిడ్డా.. ఎవడు వస్తాడో రండి.. నేను చూస్తా. రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్న. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దేశం అబ్బురపడే రీతిలో సచివాలయం లోపల మేం ప్రతిష్ఠ చేస్తాం. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయులకి విలువ ఇవ్వని సన్నాసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్, ఆయన కొడుకు తెగించి దోచుకున్నరు. ఆ కాలకేయ ముఠా, మిడతల దండు నుంచి తెలంగాణను కాపాడుకుందాం’’ అని రేవంత్ విమర్శలు చేశారు.