తగ్గనున్న డీజిల్, పెట్రోల్ ధరలు.. ఎంత తగ్గుతున్నాయో తెలుసా?
ఇది ఆదాయపు పన్నులో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాదిరిగానే ఉంటుంది. లాభాల్లో అసహజమైన పెరుగుదల ఉన్నప్పుడు విండ్ ఫాల్ ట్యాక్స్ను విధిస్తారు.
నిర్దేశం, హైదరాబాద్ః వాహనదారులకు అద్దిరిపోయే గుడ్న్యూస్ అందించనుంది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సంకేతాలు ఇచ్చారు. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఆయన.. చమురు కంపెనీలపై విధించిన విండ్ఫాల్ ట్యాక్స్ను తొలగించే ప్రతిపాదనను కేంద్రం సమీక్షిస్తోందని వెల్లడించారు.
ఇది ఆదాయపు పన్నులో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాదిరిగానే ఉంటుంది. లాభాల్లో అసహజమైన పెరుగుదల ఉన్నప్పుడు విండ్ ఫాల్ ట్యాక్స్ను విధిస్తారు. పెట్రోలియంతో సహా కొన్ని పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వం ఈ పన్ను విధిస్తుంది. 2022లో తొలిసారిగా కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ని అమలులో తీసుకొచ్చింది. ప్రపంచ చమురు ధరలలో ఆకస్మిక హెచ్చుతగ్గుల నుంచి చమురు కంపెనీలు భారీ లాభాలను ఆర్జించినప్పుడు.. ఈ పన్ను విధించబడుతుంది. ప్రపంచ చమురు ధరలకు అనుగుణంగా ప్రభుత్వం నెలకు రెండుసార్లు విండ్ఫాల్ పన్నును సవరిస్తుంది. ఇక ఇప్పుడు ఈ ట్యాక్స్ను పూర్తిగా తొలగించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది. ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలకు లాభాల మార్జిన్ తగ్గిపోతున్న నేపథ్యంలో విండ్ ఫాల్ ట్యాక్స్ను తొలగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.