Take a fresh look at your lifestyle.

కవిత ఇంకా జైలులోనే..

0 15

కవిత ఇంకా జైలులోనే..
– కవితకు బెయిల్ ఇస్తే సాక్షాలు మాయం
– కవితపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి..
– కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్..
నిర్దేశం, హైదరాబాద్ :
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విదించింది. లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరు పరచగా 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో కవితను సీబీఐ ప్రశ్నించిన అనంతరం గడువు ముగియడంతో సోమవారం కోర్టులో హాజరు పరిచారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. కోర్టుకు వెళుతున్నప్పుడు కవిత మాట్లాడుతూ ఇది సీబీసీ విచారణ కాదు.. బీజేపీ విచారణ అంటూ వ్యాఖ్యనించింది.

కవితకు బెయిల్ ఇస్తే సాక్షాలు మాయం

కాగా సోమవారం కవితను సీబీఐ అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమయంలో సీబీఐ తన వాదనలను వినిపించింది. ‘సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమెకు విచారణకు సహకరించడం లేదు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ. 14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించాం. ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించాం. ఆమె విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి కలిగిన వ్యక్తి. కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయడంతో పాటు, చెరిపేసే అవకాశం ఉంది. కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెను విచారించేందుకు మరింత సమయం కావాలి.’ అని కోర్టును కోరింది.

కవితపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి..

కాగా బయట బీజేపీ వాళ్లు మాట్లాడేదే.. లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారు. ఇందులో కొత్తది ఏమీ లేదు.’ అని అసహనం వ్యక్తం చేశారు కవిత. ఈ నేపథ్యంలో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోసారి అలా మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడుతారంటూ అసహనం వ్యక్తం చేశారు.

కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఇటీవల అరెస్ట్ చేయడం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం రెండో రోజు ఢిల్లీలోని తమ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. ప్రస్తుతం మూడు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీబీఐ కేంద్ర కార్యాలయంలో కవితను కలిసి ధైర్యం చెప్పారు.
ఇంతకు కవిత ఇంకెంత కాలం జైలులో ఉంటుందో.. బెయిల్ ఎప్పుడు వస్తుందో చూడాల్సిందే..

Leave A Reply

Your email address will not be published.

Breaking