యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం
నిర్దేశం, యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మండలంలోని లింగారెడ్డిగూడెంకు చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డిని, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి శనివారం చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.
ఈ వివాహం కేవలం చట్టబద్ధమైన సంతకాలతో, సరళంగా జరిగింది. భారీ హాలులు, ఖరీదైన డెకరేషన్లు, వందలాది మంది అతిథులు, లావణ్యాలు ఏమీ లేకుండా… కేవలం దగ్గరి బంధువులు, స్నేహితులు, కొందరు ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఆదర్శ వివాహం పూర్తయింది. పలువురు ఉన్నతాధికారులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు. ఇద్దరూ సమాజ సేవలో నిమగ్నమైన అధికారులు… వారి వివాహం కూడా సమాజానికి ఓ సందేశంగా నిలిచింది.
నేటి యువతకు పెళ్లి అంటే డబ్బు ఖర్చు, పోటీ, ఆడంబరం అనే భావనను ఈ జంట తిరస్కరించింది. సరళత, సాధారణత, ఆదర్శం. ఇవే నిజమైన సంతోషానికి మూలాలని చాటారు. ఈ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అందరి ప్రేమాభిమానాలు అందుకుంటుంది.
ఇలాంటి ఆదర్శ జంటలు ఇతరులకు స్పూర్తిగా నిలుస్తాయి… సమాజం మారాలి!





