విభజన సమస్యలపై అడుగులు
హైదరాబాద్, నిర్దేశం:
2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో.. విభజన చట్టంలోని చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉండి పోయాయి. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్రానికి పలు రూపాల్లో విన్నపాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఎట్టకేలకు.. తాజాగా కేంద్ర హోం శాఖ ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది.ముఖ్యంగా విభజన చట్టం-2014లోని షెడ్యూల్ 9, 10లలోని సంస్థలు, ఆస్తుల విభజనపై కేంద్రం దృష్టి పెట్టింది. అదేసమయంలో ఉమ్మడి ప్రాజెక్టుల పూర్తికి కూడా.. ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో వడి వడిగానే ఈ సమస్యలు కొంతవరకైనా పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత రెండు మాసాల్లో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సైతం ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షిస్తూనే.. విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారుఈ నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతూ.. తాజాగా కేంద్ర హోం శాఖ నోట్ విడుదల చేసింది. షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం అత్యంత కీలకంగా మారింది. అదేవిధంగా షెడ్యూల్ 10లోని సంస్థల విభజన(ఆర్టీసీ సహా ఇతర సంస్థలు)ను వేగంగా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే.. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిని కూడా కేంద్రం పరిశీలిస్తోంది.అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధుల విషయంపైనా కేంద్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోం ది. ఈ క్రమంలో ఏపీకి 350 కోట్లు, తెలంగాణకు 270 కోట్ల రూపాయలను ఇవ్వనుంది. దుగ్గరాజపట్టం వద్ద పోర్టు నిర్మాణానికి, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా త్వరలోనే మార్గం సుగమం కానుందని అధికార వర్గాలు చెబుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. సుదీర్ఘ విరామంతర్వాత.. రెండు రాష్ట్రాల విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం రెడీ అయింది.