పూజ చేస్తానని లేడీ ప్రొడ్యూసర్కు రూ.10 లక్షల టోకరా..అఘోరీ మరో మోసం
హైదరాబాద్, నిర్దేశం:
ఇటీవల లేడీ అఘోరీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమ కూతురిని ఎత్తుకెళ్లినట్లు బాధిత తల్లిదండ్రులు వాపోయారు. తాజాగా మరో భారీ మోసం వెలుగు చూసింది. యోని పూజ చేస్తానని ఓ లేడీ ప్రొడ్యూసర్ నుంచి రూ.10 లక్షలు వసూలు చేసింది. మరో రూ.5 లక్షలు డిమాండ్ చేయగా, బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అఘోరీ లీలలు మరోసారి వెలుగులోకి చూశాయి.
రెండు నెలల క్రితం సైబరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్ లో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ లేడీ నిర్మాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యోని పూజ చేస్తానని మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలు..
అఘోరీ మోసాన్ని రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూర్ మండలానికి చెందిన ఓ లేడీ ప్రొడ్యూసర్ బయటపెట్టింది. అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు తెలిపింది. పరిచయం అయిన 2 నెలల తర్వాత ప్రొద్దుటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చినట్లు చెప్పింది. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేదని పేర్కొంది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మించడంతో అంగీకరించానని వివరించింది.
వారం రోజుల్లో పూజ చేద్దామని ఖర్చుల కోసం అడిగితే, అఘోరీ అకౌంట్ లో రూ. 5 లక్షలు వేశానని లేడీ ప్రొడ్యూసర్ తెలిపింది. అనంతరం పూజ కోసం ఉజ్జయినిలోని ఫాం హౌస్ కు తీసుకెళ్లి పూజ చేయించిందని పేర్కొంది. మరుసటి రోజు మరో రూ. 5 లక్షలు అమె అకౌంట్ లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని అఘోరీ భయపెట్టిందంది. దీంతో మరో రూ. 5 లక్షలు అకౌంట్ లో వేశానని చెప్పింది.
దీన్ని అలుసుగా చేసుకుని అఘోరీ మాతతో పూజ పూర్తి చేసుకున్నావు కాబట్టి, మరో రూ. 5 లక్షలు ఇవ్వాలని.. లేదంటే నిన్ను, నీ కుటుంబ సభ్యులను మంత్ర శక్తులతో అంతం చేస్తానని.. బెదిరించినట్లు ఫిర్యాదులో బాధితురాలు వివరించింది.