భారత్ పై ట్రంప్ పన్నుల భారం
న్యూఢిల్లీ, నిర్దేశం:
భారత్ నుంచి అధికంగా ఎగుమతులు జరిగే దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది. వ్యవసాయ రంగం నుంచి మొదలుకుని ఫార్మా రంగం వరకు.. అనేక రంగాల్లో మన ఉత్పత్తులు అమెరికా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. అక్కడ నుంచి మన దేశానికి పెద్ద ఎత్తున ఉత్పత్తులు వస్తున్నాయి. కానీ.. మన పంపించే ఉత్పత్తులపై అమెరికా నామమాత్రపు సుంకాలు విధిస్తుంటే.. భారత్ మాత్రం భారీగా సుంకాలు, టారీఫ్ లు విధిస్తోంది. ఈ విషయమై.. ఇప్పటికే అనేక సార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న ట్రంప్.. ప్రతికార పన్నుల విధానాన్ని అమలు చేస్తానంటూ ప్రతీన బూనాడు. అదే జరిగితే.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోతాయని అంచనా వేస్తున్నారు. ఈ టారిఫ్ ల విలువ ఎంతో తెలుసా.. ఏకంగా రూ.61 వేల కోట్లు. అవును.. ఈ మేరకు మన దేశీయ పరిశ్రమలు అదనంగా అమెరికాకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.ఇటీవల మోదీ పర్యటనలోనూ ప్రతీకార ట్యాక్స్ లు ఉంటాయని తెలిపిన ట్రంప్.. ఏప్రిల్ మొదటి తారీఖున నూతన ట్యాక్సులపై క్లారిటీ ఇస్తానని ప్రకటించారు. దాంతో.. ఏం జరుగునుంది, ఏ విభాగాల్లో ట్యాక్సులు పెరగనున్నాయనే ఆందోళన దేశీయ ఎగుమతిదారుల్లో నెలకొని ఉంది. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య అంతరం, ఇతర ట్యాక్స్ విధించే అవకాశాలున్న ఉత్పత్తుల జాబితాలోని వస్తువుల ఎగుమతుల పరిమాణాన్ని పరిశీలిస్తే.. ఏటా 7 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.61,000 కోట్లు.. మన నుంచి ట్రంప్ వసూలు చేసే అవకాశాలున్నాయంటున్నారు. అయితే.. ట్రంప్ నూతన ట్యాక్సులు ప్రకటించాకే.. పూర్తి స్థాయి క్లారిటీ వస్తుందని అంటున్నారు. అప్పుడే.. మన ఎగుమతులపై ఎలాంటి ప్రభావం ఉండనుందో అంచనాలు రాగలుగుతామని ప్రభుత్వ అధికారులు అంటున్నారుఅమెరికా- భారత్ మధ్య వాణిజ్యంలో.. భారతే పై చెయ్యిలో ఉంది. మన దేశం నుంచే అత్యధిక ఎగుమతులు జరుగుతున్నాయి. గతేడాది ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని పరిశీలిస్తే.. భారత్ నుంచి 74 బిలియన్ డాలర్ల మేర ఉత్పత్తులు అమెరికాలోకి వెళితే.. అక్కడి నుంచి మన దగ్గరకు 42 బిలియన్ డాలర్ల మేర మాత్రమే దిగుమతులు జరిగాయి. అదే తీరుగా.. ట్రంప్ ఆరోపిస్తున్న పన్నుల విధానాన్ని పరిశీలిస్తే.. మన దేశం అమెరికా ఉత్పత్తులపై సరాసరి 11 శాతం టారిఫ్ వసులూ చేస్తుండగా, అమెరికాలోమాత్రం 2.8 శాతమే కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య టారిఫ్ వ్యత్యాసం 8.2% అధికం గా ఉండడమే ట్రంప్ ఆగ్రహానికి కారణం.
ఇక విభాగాల వారీగా పరిశీలిస్తే.. భారత్ నుంచి వివిధ రసాయనాలు, లోహ ఉత్పత్తులు, ఆర్నమెంట్లు, ఆటోమొబైల్, ఫార్మా, ప్రాసెసింగ్ ఫుడ్ రంగాలపై ఎక్కువగా ప్రభావం పడనుంది. కాగా.. అభరణాల విభాగంలో.. ముత్యాలు, రత్నాభరణాలు వంటివే అత్యధికంగా.. 8.5 బి. డాలర్ల మేర ఉత్పత్తులు అమెరికాకు పంపించాము. ఆ తర్వాత అత్యధికంగా ఫార్మా 8 బి.డా, పెట్రో రసాయన ఉత్పత్తులు 4 బి.డా మేర ఎగుమతి అయ్యాయి. ఇక.. అమెరికా నుంచి మన దేశానికి వచ్చిన ఉత్పత్తుల్లో చెక్క ఉత్పత్తులు, మెషినరీ ఐటమ్స్ పై 7%, పాదరక్షలు, రవాణా సామగ్రిపై 15-20% శాతం పన్నులు వసూలు చేసిన భారత్.. ఆహార వస్తువులపై 68% శాతం టారిఫ్ లను రాబట్టింది. దేశీయ ఆహార పరిశ్రమను రక్షించుకునేందుకు ఇలా.. భారీ సుంకాల్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ.. ఇరువైపుల నుంచి చూసినప్పుడు ఇది ఆమోదయోగ్యం కాదు అంటున్నారు.. అమెరికన్ అధికారులు.ఇక.. ఈ రంగాల కంటే వ్యవసాయ ఉత్పత్తులు, మోటార్ సైకిళ్లపై విధిస్తున్న పన్నులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అత్యంత ప్రాధాన్య దేశం (ఎమ్ఎఫ్ఎన్) కింద మన వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా కేవలం 5% టారిఫ్ నే వసూలు చేస్తోంది. కానీ.. మనదేశం మాత్రం అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై ఏకంగా 39% పన్నులు రాబడుతోంది. అలాగే.. అమెరికా మోటార్ సైకిళ్లపై అయితే 100% సుంకం అమలు చేస్తూ.. దిగుమతుల్ని నియంత్రించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సందర్భంలో.. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే మోటార్ సైకిళ్లపై అమెరికా 2.4% టారిఫ్ మాత్రమే విధిస్తున్నట్లు వాషింగ్టన్ స్పష్టం చేస్తోంది. ఇలా.. అనేక రకాల వివాదాలున్న నేపథ్యంలో.. ట్రంప్ ప్రతీకార టారిఫ్ లను విధిస్తే.. మన ఎగుమతిదారులకు మరింత భారం తప్పదు అంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం మేలని అంటున్నారు.