బండి భగిరత్ పై పోక్సో కేసు..
సామాన్యుడైతే వెంటనే అరెస్టు… మంత్రి కొడుకైతే జాప్యమా..?
కేంద్ర మంత్రి కుమారుడు భగిరత్ కు విఐపీ ట్రీట్మెంట్?
మైనర్ బాలికకు సీఎం రేవంత్ న్యాయం చేస్తాడా..?
కొత్త డీజీపీ సీవీ ఆనంద్ కు ఈ కేసు సవాల్..

(యాటకర్ల మల్లేష్)
కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ (భగిరత్) పై పోక్సో కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. 17 ఏళ్ల మైనర్ బాలికను మద్యం తాగించి లైంగిక దాడి (అత్యాచారం) చేశారని ఆరోపణలు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8న నమోదైన ఈ కేసు ఇప్పుడు అధికార పార్టీ, పోలీసు వ్యవస్థకు పెద్ద సవాల్గా మారింది. చట్టం ఎవరికీ చుట్టం కాదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినా… మంత్రి కుమారుడైతే ఎందుకు ఆలస్యం? అరెస్టు ఎందుకు లేదు? ఇది సామాన్యుడి కేసు కాదు… వీఐపీ కేసు కాబట్టి విచారణ పేరిట జాప్యం చేస్తారా? అని సోషల్ మీడియాలో నెటిజన్ లు ఫైర్ అవుతున్నారు.
మైనర్ బాలిక ఆరోపణలు ఏమిటి? భయపెట్టి, బెదిరించి…
బాలిక తల్లి ఫిర్యాదు ప్రకారం, గతేడాది డిసెంబర్ 31న మొయినాబాద్ ఫామ్హౌస్లో భగీరథ్ బాలికను మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడు. స్నేహం పేరిట పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బలవంతంగా లైంగిక దాడి చేశాడని ఆరోపణ. బండి సంజయ్ కుమారుడు బాలిక కుటుంబాన్ని ఇంటికి పిలిచి బెదిరించినట్లు కూడా ఫిర్యాదు. “నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో! ఆమెను నా కొడుకు పెళ్లి చేసుకోవాలా?” అని దిగజారుడు వ్యాఖ్యలు చేశాడని, “నాతో పెట్టుకుంటే మీకు ఏం జరిగినా నా బాధ్యత కాదు” అని బెదిరించినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. ఈ కేసులో బీఎన్ఎస్ సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో సెక్షన్లు 11/12 కింద కేసు నమోదు అయింది.
అయితే భగీరథ్ ఎదురు ఫిర్యాదు చేశాడు. కరీంనగర్లో బాలిక కుటుంబం తనను హనీట్రాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని. ఇది రాజకీయ కుట్ర అని బండి సంజయ్ కూడా ప్రకటించారు. కానీ… మైనర్ బాలికపై హనీట్రాప్ కేసు పెట్టడం ఎంతవరకు సరైనది? చట్టం మైనర్ను రక్షించాలి కదా? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ లు దుమ్మెత్తి పోస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సీరియస్… డీజీపీకి ఈ కేసు సవాల్!
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. మే 11న డీజీపీ సీవీ ఆనంద్ను పిలిచి “తక్షణం విచారణ మొదలుపెట్టండి” అని ఆదేశించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో తెలంగాణ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి కూడా స్పందించి, నగర పోలీస్ కమిషనర్ నుంచి వివరాలు తెప్పించుకుని ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.

బీఆర్ఎస్ దుమ్మెత్తి పోస్తోంది… బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం!
బీఆర్ఎస్ నేతలు ఈ కేసుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాక్ష్యాలు బయటపెట్టి కఠిన చర్యలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. రాంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువనేత జైసింహ్ తదితరులు పాల్గొన్నారు. “నిష్పక్షపాత విచారణ కావాలంటే బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి” అని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ డిమాండ్ చేశారు.
సామాన్యుడైతే ఏమవుతుంది? వీఐపీకి మాత్రం రక్షణనా..?
ఇదే కేసు సామాన్యుడి మీద ఉంటే… పోలీసులు ఆఘమేఘాల మీద అరెస్టు చేసి, స్టేషన్లో నిర్బంధించేవారు. కానీ ఇక్కడ నిందితుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కాబట్టి అరెస్టు చేయడంలో నిర్లక్షం చేస్తున్నారు… ఇంతకు పోక్సో కేసులో నిందితుడు భగీరథ్ దేశంలో ఉన్నాడా, విదేశాలకు పారిపోయాడా అనేది కూడా స్పష్టం లేదు. పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. బాధితుల ఫోన్ రికార్డులు, భగీరథ్ ఫోన్ రికార్డులు, ఇంటి సీసీ ఫుటేజ్లు తక్షణం చెక్ చేయాలని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మైనర్తో తిరిగిన స్థలాలను సీసీటీవీలతో సరిపోల్చాలని ఆయన కోరారు.
*చట్టం ఎవరికి చుట్టం కాదు… నూతన డీజీపీ సీవీ ఆనంద్పై పూర్తి బాధ్యత..
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా “చట్టం ఎవరికీ చుట్టం కాదు” అని అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడు ఆ మాటలు కార్యరూపం దాల్చాలి. నూతన డీజీపీ సీవీ ఆనంద్పై పూర్తి బాధ్యత ఉంది. సాక్ష్యాలు పకడ్బందీగా సేకరించి, నిందితుడు ఎవరైనా అరెస్టు చేసి శిక్షించాలి. రాజకీయ రక్షణ ఉంటే… న్యాయం ఎక్కడ? మైనర్ బాలికకు న్యాయం జరగాలి. ఇది కేవలం ఒక కేసు కాదు… తెలంగాణలో చట్టం పరిపాలన ఎలా ఉందో చూపించే టెస్ట్ కేసు.
న్యాయం జరగాలి… జాప్యం కాదు!
బీఆర్ఎస్, కాంగ్రెస్, సోషల్ మీడియా నెటిజన్లు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తక్షణం అరెస్టు, నిష్పక్షపాత విచారణ, శిక్ష. బండి సంజయ్ కుమారుడికి రక్షణ ఇవ్వకుండా, చట్టం తన మార్గంలో నడవాలి. మైనర్ బాలిక భవిష్యత్తు, ఆమె కుటుంబం భద్రత ఇవి ప్రధానం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చూపించే చర్యలే… తెలంగాణలో న్యాయం ఎవరి కోసం ఉందో నిరూపిస్తాయి.
