– చెర్నోబిల్ జోన్ గా వయనాడ్ అవుతుందనే ఆందోళన
– సందర్శకులు ఎవరూ రావొద్దని ప్రచారం చేస్తున్న కేరళ పోలీసులు
– టీవీ షోలతో డార్క్ టూరిజంపై జనాల్లో క్రేజ్
నిర్దేశం: కేరళలోని వాయనాడ్లో మంగళవారం భారీ కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం సాయత్రం నాటికి సుమారు 280 మందికి పైగా మరణాలు సంభవించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వందల మంది గాయపడ్డారు. 3000 మందికి పైగా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడడంతో నీటితోపాటు వచ్చిన చెత్తాచెదారం చుట్టుపక్కల గ్రామాలను ముంచేసింది.
ఆ ప్రాంతంలో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితి అంత తొందరగా చక్కబడకపోవచ్చని అంటున్నారు. పైగా వర్షాలు పడుతుండడంతో పరిస్థితి ఇంకా జటిలం అవుతోంది. ఇలాంటి తరుణంలో.. ‘డార్క్ టూరిజం’ అనేది ఇప్పుడు తెరమీదకు వచ్చింది. విపత్తు ప్రాంతాలను సందర్శించవద్దని, అది సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని పోలీసులు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థన చేయడంతో ఆ పదం నెట్టింట్లో వైరల్గా మారింది. విపత్తు ప్రాంతాలను నివారించాలని, అవసరమైతే సహాయం కోసం 112కు కాల్ చేయాలని తమ ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు.
ఇంతకీ డార్క్ టూరిజం అంటే ఏమిటి?
మరణం, విషాదం, హింస లాంటి అసాధారణమైన సంఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాలను సందర్శించడాన్నే ‘డార్క్ టూరిజం’ అంటారు. ఇందులో స్మశానవాటికలు, సమాధులు, మార్చురీలు, విపత్తు ప్రాంతాలు, యుద్దభూములు, జైళ్లు, ఉరితీసే ప్రాంతాలతో పాటు నేర చరిత్ర కలిగిన ప్రదేశాల లాంటివి ఉంటాయి. ఉదాహరణకు.. ఉక్రెయిన్లోని చెర్నోబిల్ జోన్ గురించి అందరూ వినే ఉంటారు. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో నాలుగో రియాక్టర్ పేలిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పుడది డార్క్ టూరిజంలో ఒక డెస్టినేషన్గా మారింది. అలాగే పోలాండ్లోని ఆష్విట్జ్ క్యాంప్స్, అమెరికాలోని 9/11 మెమోరియల్తో పాటు హాంటెడ్ హౌస్లు, పారానార్మల్ యాక్టివిటీ, చారిత్రక సంఘటనలు జరిగిన ప్రదేశాలు ఈ టూరిజంలో భాగమయ్యాయి.
టీవీ షోల కారణంగా
ఈ మధ్యకాలంలో డార్క్ టూరిజం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా.. ‘చెర్నోబిల్’, ‘ద డార్క్ టూరిస్ట్’ వంటి వెబ్ సిరీస్ల పుణ్యమా అని.. జనాలు డార్క్ టూరిజంపై మక్కువ చూపించడం స్టార్ట్ చేశారు. ఆ ప్రదేశాల చరిత్రతో పాటు అక్కడి సంస్కృతి గురించి తెలుసుకోవడం, విషాదాలను అనుభవించిన ప్రజల ఉద్వేగాలతో ప్రత్యక్షంగా కనెక్ట్ అవ్వడం కోసమే సందర్శకులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఈ డార్క్ టూరిజం కారణంగా చారిత్రక ఘటనలను తెలుసుకోవడంతో పాటు.. బాధలు అనుభవించిన వారికి నివాళులు అర్పించడానికి వీలు కలుగుతుంది. టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రకృతి అందాలను టూరిస్టులు ఎలా ఆస్వాదిస్తారో.. అలాగే డార్క్ టూరిజంతో చరిత్రతో పాటు బాధితుల భావోద్వేగాలతో కనెక్ట్ అవుతుంటారు.
కేరళ పోలీసుల అభ్యర్థన
ఇప్పుడు వయనాడ్లో సంభవించిన ప్రకృతి విలయం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో.. డార్క్ టూరిజంలో భాగంగా పర్యాటకులు ఆ విపత్తు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందని కేరళ పోలీసులు భావిస్తున్నారు. అలా వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎవరూ అక్కడికి రావొద్దని కేరళ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, వందలాది మంది ప్రజల ఆచూకీ కోసం కసరత్తులు చేస్తున్నామని, అందుకే సందర్శకులు రావొద్దని ఎక్స్ వేదికగా కేరళ పోలీసులు కోరారు.