బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీలకు ఇవ్వాలి
ఈటలను వేధించి ఎందుకు బటయకు పంపారు
బీసీలపై కవిత మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : ఎంపీ రఘునందన్రావు
సిద్దిపేట, నిర్దేశం:
రాజకీయ లబ్ధికోసం బీసీలపై ప్రేమ ఉన్నట్టు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు.. తప్ప బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీనేనని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్తో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఇప్పించాలని కవితకు సవాల్ విసిరారు. బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శలు చేశారు. గజ్వేల్ పట్టణంలో శుక్రవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడారు. శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిని బీసీ నేతకు ఇవ్వండి. శాసన మండలిలో కూడా మరో బీసీ నేతకు ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. ఇచ్చిన నాలుగు మంత్రి పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వరని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీసీల్లో పెద్ద సామాజిక వర్గానికి చెందిన ఈటెలను మధ్యలోనే మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు కావాలి.. మరి బీసీలకు పదవులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ రోజు ఫామ్హౌస్ చర్చలో కేసీఆర్తో తాను చెప్పిన విషయంపై కవిత మాట్లాడాలని సవాల్ విసిరారు. ఢల్లీి ముఖ్యమంత్రి అవకాశం వస్తే బీజేపీలో ఒక మహిళకు ఇచ్చామని గుర్తుచేశారు. మొదటి ఐదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేని ఒకే ఒక కేబినెట్ ఈ దేశంలో ఏదైనా ఉంటే అది కేసీఆర్ కేబినెట్ అని విమర్శించారు. బీజేపీని విమర్శించే ముందుగా బీఆర్ఎస్ చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పారు. బీజేపీ వైపు వేలెత్తి చూపించే బదులు ముందుగా బీఆర్ఎస్ నేతలు తప్పులు సరిదిద్దుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హితవు పలికారు.