ఎయిర్ పోర్ట్ టు ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ అడుగులు
నిర్దేశం, హైదరాబాద్ః
హైదరాబాద్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్షా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రో సేవలను 40 కిలోమీటర్ల మేర విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కొత్త మెట్రో మార్గానికి సంబంధించిన డీపీఆర్ను తక్షణమే సిద్ధం చేసి, కేంద్రానికి పంపాలని సూచించారు.
ఫ్యూచర్ సిటీ దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుండగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెట్రోను మీర్ ఖాన్ పేట వరకు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విస్తరణ బాధ్యతను హెచ్ఎండీఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 24,269 కోట్ల అంచనాతో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్ను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారుకేవలం మెట్రోనే కాదు, రీజినల్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి పైనా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్- విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే.. హైదరాబాద్ నుంచి రాయ్పూర్ వరకు, మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్హైచ్ఏఐకి పంపించాలని సూచించారు. భూ సేకరణలో ఏర్పడుతున్న సమస్యలపై సీఎం ఆరా తీశారు. పంటలు ఉన్న భూముల విషయంలో నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్హెచ్ఏఐ అంగీకరించకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు తెలియజేశారు.ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.