ఎవరి స్వార్థం వాళ్లదే..
– బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నీళ్ల లొల్లి
– హిందూత్వ ఎజెండాతో బీజేపీ
– కనుమరుగైన కమ్యూనిష్టులు
– సమస్యలతో ప్రజల వద్దకు బీఎస్పీ..
– రాజకీయ లబ్ధి కోసం సినిమాలు
(ఈదుల్ల మల్లయ్య)
రాబోయే పార్లమెంట్ ఎన్నికలు.. లీడరుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ అప్పుడు.. ఇప్పుడు అంటూ నోరూరించడంతో పొలిటికల్ గా వేడెక్కింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో గెలుపు ధ్యేయంగా వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి పొలిటికల్ పార్టీలు.
అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ ఎస్ ఓడింది.. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలను గెలిచింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష హోదాలో బీఆర్ ఎస్ నిలిచింది. బీజేపీ సైతం ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికలు సవాల్ గా మారాయి. అత్యధికంగా పార్లమెంట్ సీట్లు గెలువడమే ఆ పార్టీల ముందున్న లక్ష్యం.
నీళ్ల లొల్లితో ఎవరికి లాభం..?
పార్లమెంట్ ఎన్నికలలో రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నీళ్ల సెంటిమెంట్ ఎత్తుకున్నాయి. బీజేపీ పార్టీ మాత్రం హిందూత్వ ఎజెండాను ఎత్తుకుని మతం పేరుతో ప్రజల ముందుకు వెళుతోంది. కృష్ణా నది ప్రాజెక్ట్ లను కృష్ణానది మేనేజ్ మెంట్ బోర్డుకు అప్పగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అలాగే కాళేశ్వర్ ప్రాజెక్ట్ ను కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి అవినీతికి పాల్పాడిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చలో మేడిగడ్డ ప్రాజెక్ట్ ప్రొగ్రాం నిర్వహించింది.
సినిమాలతో రాజకీయ లబ్ధి..
సినిమాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా లాభ పడటానికి రజాకార్ సినీమాను వాడుకుంటుంది. ఇప్పటికే అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ చేపట్టిన బీజేపీ హిందువుల హృదయాలలో నిలిచింది. అలాగే తెలంగాణలో బీజేపీ రజాకార్ సినిమా ద్వారా ఓట్లను రాబట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
రజాకార్ సినీమా..
1948లో హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేయడం ఆధారంగా రజాకార్ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా, హిందువులను ఆకట్టుకునే వ్యూహంతో ఈ సినిమాను రాజకీయ మైలేజీకి వాడుకోబోతోంది. ఈ సినిమాను బీజేపీకి చెందిన నాయకుడే గూడూరు నారాయణరెడ్డి నిర్మించడం విశేషం. ఈ చిత్రం గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల కావాల్సి ఉంది. కానీ ఆలస్యమైంది. గత ఏడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేయాలని నిర్ణయించారు. అక్టోబరులో ప్రధాన ఎన్నికల అధికారి కి లేఖ రాశాడు. ఇది మత విద్వేషాలను సృష్టించే ఉద్దేశ్యంతో చేయలేదని, చాలా మంది తమ సినిమాను వ్యతిరేకిస్తున్నారని విన్నవించారు.
సెన్సార్ బోర్డుకు బీఆర్ ఎస్ ఫిర్యాదు..
అంతేకాకుండా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు 2023 సెప్టెంబర్లో సినిమా విడుదలను నిలిపివేయాలని సెన్సార్ బోర్డుకు కంప్లైంట్ చేశాడు. నిజాం కాలంలో ప్రజలపై జరిగిన మత హింస కారణంగా చాలా మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణలో నిజాం ప్రభుత్వానికి, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, అణగారిన కులాలపై అణచివేత లాంటి అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. వీటి ఆధారంగా రజాకార్ సినిమా రూపుదిద్దుకుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలుచుకొని ఓటింగ్ శాతం పెంచుకుంది. ఇదే దూకుడుతో పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో కనీసం సగం సీట్లు దక్కించుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చారు. ఈ క్రమంలో రజకార్ సినిమాతో బీజేపీ హిందుత్వ సెంటిమెంట్ తో ఓట్లు రాబట్టుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.