అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణంలోకి ప్రజలకు అనుమతి
హైదరాబాద్, నిర్దేశం:
అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తుతో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం వద్ద వీవీఐపీల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ నివాళులర్పించేలా చర్యలు చేపట్టింది. అంబేడ్కర్ విగ్రహం పాదాల దాకా వెళ్లేందుకు ఇప్పటివరకు అవకాశం లేదు. అయితే, అంబేద్కర్ జయంతి సందర్బంగా ఈరోజు వీవీఐపీలను, వీఐపీలను ఇందుకు అనుమతించనున్నారు. అంబేడ్కర్ విగ్రహ పీఠం(పాత పార్లమెంటు భవనం ఆకారంలో నిర్మించారు)లో ఏర్పాటు చేసిన లైబ్రరీ, మ్యూజియం సందర్శనకు కూడా ప్రజలను అనుమతించనున్నారు.
అయితే, అవి ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో.. అంబేడ్కర్ జీవితం నుంచి ప్రేరణ పొందే ఘట్టాలను చిత్రిస్తూ రూపొందించిన కళాఖండాలను సేకరించడానికి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో విద్యార్థులు, కళాకారులకు పోటీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద జరుగుతున్న ఈ పోటీల్లో 20బృందాల దాకా పాల్గొంటున్నాయి. పెయింటింగ్, ఇతరత్రా ఆర్ట్ సామగ్రి కోసం హెచ్ఎండీఏ ఒక్కో బృందానికి రూ.10వేల చొప్పున అందజేసింది. ఈ బృందాలు రూపొందించిన కళాఖండాలను అంబేడ్కర్ జయంతి రోజున మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఇందులో ఉత్తమమైన మూడింటిని ఎంపిక చేసి వారికి నగదు బహుమతులు అందిస్తారు. ఆ కళాఖండాలను అంబేడ్కర్ మ్యూజియంలో శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నారు.