ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా జీవిత ప్రస్థానం

ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా ప్రస్థానం

 12 నవంబర్ 2024 రాత్రి 8.36 గంటలకు సాయిబాబా గారు  మరణించారని  నిమ్స్ వైద్యులు ప్రకటించారు. రాజ్య కుట్రకు, మానవీయ దృక్పథం లేని న్యాయ వ్యవస్థలు కలిసి జి.ఎన్. సాయిబాబాను బలిగొన్నారు !! సాయిబాబా గారికి  లాల్ సలాం ! జోహార్లు ! అశ్రు నివాళులు…శ్రద్ధాంజలి !!

🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿


విద్యావేత్త, రచయిత, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్.  డిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి 55 ఏళ్ల వయసులో 90శాతం శారీరక వైకల్యంతో ఉన్న సాయిబాబా మెదడే ఎక్కువ ప్రమాదకరమైనది అన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్య కుట్రకు,

మానవీయ దృక్పథం లేని న్యాయ వ్యవస్థలు కలిసి

జి.ఎన్. సాయిబాబాను బలిగొన్నారు. 

……

జి.ఎన్. సాయిబాబా విద్యావేత్త, రచయిత, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్. అతను డిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

పేద రైతు కుటుంబంలో పుట్టి.. విప్లవ బాట పట్టి..

గోకరకొండ నాగ సాయిబాబా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమలాపురంలో పేద రైతు కుటుంబంలో జన్మించాడు. తన భార్య తెలిపిన విషయాల ప్రకారం వారి గృహానికి విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఐదేళ్ల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికంగా విద్యాభ్యాసం చేసిన తరువాత అమలాపురం లోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసాడు.  హైదరాబాదు విశ్వవిద్యాలయం నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసాడు.  అతను సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా విద్యాభ్యాసం పూర్తి చేసాడు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకునిగా చేరాడు.  2013లో పీహెచ్‌డీ పూర్తిచేశాడు.

 వామపక్ష రాజకీయాల వైపు

అమలాపురంలో గ్రాడ్యుయేషన్ చేసున్న కాలంలోనే అతను వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ (ఏఐఆర్‌పీఎఫ్) లో చేరాడు. 1992లో హైదరాబాదు విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు ఆ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శి అయ్యాడు. 1995 నాటికి ఆ సంస్థకు ఇండియా ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆ తర్వాత అతను ఆర్‌డీఎఫ్ అనే సంస్థలో పని చేశాడు. పోలీసులు, హోంశాఖ అధికారుల ప్రకారం అతను పనిచేసిన సంస్థలన్నీ మావోయిస్టు అనుబంధ సంస్థలు. అతనికి మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనే అరోపణతో 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసు విచారణలో కోర్టు అతనికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అతను నాగ్‌పూర్ జైలులోని ’అండా సెల్‌‘లో ఏకాంతచెరలో ఉన్నారు.

ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గాసాయిబాబా

దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు. 2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆయనను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో నిర్బంధించారు.

సాయిబాబాకు 90 శాతం వైకల్యము

వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఏ కేసులలో జైలుకు వెళ్లారు..

”2013 సెప్టెంబర్ 12 నాడు లేదా అంతకుముందు ఈ ఆరుగురు నిందితులూ భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి ప్రజలను సమీకరించడానికి పూనుకున్నారు. నేరపూరిత బలప్రయోగం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని లోబరచుకోవడానికి, ప్రాణాలు, ఆస్తుల మీద భారీ స్థాయి హింస, విధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు. తద్వారా సాధారణ పౌరుడికి ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద విశ్వాసాన్ని సడలించడానికి, క్షీణింపజేయడానికి, తద్వారా చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వ వ్యవస్థను అస్థిరపరచడానికి ఒడిగట్టారు. రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా వేర్పాటు, తిరుగుబాటు ఆలోచనలను వ్యాప్తిని నిర్వహించడానికి సిద్ధపడ్డారు. ఈ నేరపూరిత కుట్ర లక్ష్యాలను సాధించడానికి, భారతదేశంలో అక్రమ మార్గాల ద్వారా డబ్బు సేకరించడానికి కుట్ర చేశారు.

మావోయిస్టు నక్సలైట్ గా..

ఈ నేరపూరిత కుట్ర లక్ష్యాలను సాధించడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్), దాని అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్‌డీఎఫ్)ల చట్టవ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించడానికి కుట్ర చేశారు.

 నేరపూరిత కుట్ర పన్నారని ఆరోపణలు..

ఉగ్రవాద ముఠా, నిషిద్ధ సీపీఐ (మావోయిస్ట్), దాని అనుబంధ సంస్థ ఆర్‌డీఎఫ్‌తో సభ్యుడిగా ఒంటరిగా లేదా సంయుక్తంగా చట్టవ్యతిరేక అనుబంధాన్ని, కార్యకలాపాలను కొనసాగించడానికి, హింసా ప్రయోగం లేదా ఇతర చట్టవ్యతిరేక మార్గాల్లో ఉగ్రవాద చర్య చేపట్టడానికి కుట్ర పన్నారు. ఇంకా దానిని ప్రచారం చేయడం, ప్రేరేపించడం, ప్రోత్సహించడం, తెలిసి సాయం చేయడానికి భారతదేశంలో నేరపూరిత కుట్ర పన్నారు” అనేది ఆరోపణ.

ఆధారం: గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు (07-03-2017) ప్రతి

‘ఒక చెయ్యీ, మెదడు మాత్రమే పనిచేస్తున్నాయి…‘

55 ఏళ్ల వయసులో 90శాతం శారీరక వైకల్యంతో ఉన్న సాయిబాబా, మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదని ఆయన న్యాయవాది బసంత్ కోర్టుకు విన్నవించారు.

సాయిబాబాకు ఆలోచించే మెదడు..

సాయిబాబాకు ఆలోచించే మెదడు ఉందని సొలిసిటర్ జనరల్ చెబుతున్నారని, కానీ ఆయన నేరానికి పాల్పడినట్లు చూపే ఆధారాలు ఏమీ లేవని బసంత్ అన్నారు. దీని మీద స్పందిస్తూ ‘తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి మెదడే ఎక్కువ ప్రమాదకరమైనది. ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన పని లేదు.’ అని జస్టిస్ షా అన్నారు. సుప్రీం స్పెషల్ బెంచ్ ఈ కేసుకున్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ చేపట్టిన సందర్భంగా పై వాక్య చేసారు.

జైలులో సాయిబాబా పరిస్థితి చాలా దుర్భరం

జైలులో సాయిబాబా పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని వారి సహచరి వసంత అన్నారు.

“2014లో అరెస్ట్ చేసినపుడు ఆయన పట్ల జైలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎడమ చేయి నరాలు దెబ్బతిన్నాయి. దానికి వైద్యం అందించకపోవడంతో ఆ చేయి బాగా పాడయింది. పాంక్రియాస్ దెబ్బతినింది. ప్రొస్టేట్ సమస్య పెరిగింది. మూత్రాశయంలో రాళ్లున్నాయి. 15 సంవత్సరాలుగా హైపర్ టెన్షన్ ఉంది” అని వసంత బీబీసీతో చెప్పారు. జైలులో నిర్లక్ష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఇంకా తీవ్రమయ్యాయని ఆమె ఆరోపించారు. “రోజువారీ మందులు కూడా అందించడం లేదు. లాయర్లు జైలు డాక్టర్లకు మందులు అందించిన తర్వాత కూడా ఆయనకు ఆ మందులు చేరడానికి తొమ్మిది, పది రోజులు పడుతోంది. ఫలితంగా ఆయన రెండు రోజుల్లో నాలుగు సార్లు కళ్లు తిరిగి పడి పోతున్నారు” అని వసంత చెప్పారు. “ఇప్పుడు ఆయనకు ఒక్క చేయి, మెదడు మాత్రమే పని చేస్తున్నాయి. బయట ఇన్ని సదుపాయాలున్నా చలికాలంలో ఆయన చేతులు కొంకర్లు పోతాయి. అలాంటిది నాగ్‌పూర్ జైలులోని అండా సెల్ పైన అంతా తెరిచే ఉంటుంది. వర్షం వచ్చినా తడిసిపోతుంది. ఎండ, వాన, చలి ఏదైనా ఆ సెల్‌లోకి నేరుగా వచ్చేస్తుంది’’ అని వసంతకుమారి వివరించారు.

సాయిబాబాను నిర్దోషిగా..

మావోయిస్టులతో సంబంధమున్న కేసులో ముంబాయి హైకోర్టు మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాను నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో ఆయన 2024 మార్చి 8న నాగ్‌పూర్‌ జైలు నుంచి ముంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజుల అనంతరం విడుదలయ్యారు. 12 అక్టోబర్ 2024న  రాత్రి 8.36 గంటలకు సాయిబాబా గారు  మరణించారు.

– మహ్మద్  గౌస్, రచయిత

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!