Take a fresh look at your lifestyle.

రాబోయే ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ప్రజలు ఓడిస్తారు : బిఎస్పీ

0 15

రాబోయే ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ప్రజలు ఓడిస్తారు

: బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 29 : రానున్న రోజుల్లో తెలంగాణ సిఎం కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, రాబోయే ఎన్నికల్లో పేదలంతా ఒక్కటై చిత్తుచిత్తుగా ఓడిస్తారని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. గత వారం తుకారాంగేట్ ఠాణాలో లాక్ అప్ డెత్ కు గురైన చిరంజీవి కుటుంబాన్ని ఆయన ఈరోజు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఇంటి దగ్గర నుండి మళ్లీ పంపిస్తామని చెప్పి తీసుకెళ్లి శవాన్ని అప్పగించారని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.

పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా, పోస్ట్ మార్టం రిపోర్టు, శవపంచనామా కూడా ఇవ్వకుండా, కనీసం చనిపోయిన తర్వాత శవాన్ని చూపించకపోవడం అన్యాయమని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఫిట్స్ వస్తే వ్యక్తి ఎలా చనిపోతారని ప్రశ్నించారు. పేదోల్ల పక్షాన మాట్లాడే వారు లేకపోతే చంపేస్తారా అని మండి పడ్డారు ఆయన.

కోట్ల రూపాయల స్కాం చేసిన వారిని ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వ లాయర్లను పంపి నేరస్తులను కాపాడే ప్రభుత్వం, చిరంజీవి వంటి పేదలను ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. ఇసుక దందాను ప్రశ్నించినందుకు నేరెళ్ల బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని, దొంగతనం నెపంతో మరియమ్మ, శేఖర్, ఖదీర్ ఖాన్, ఇపుడు చిరంజీవిలను ప్రభుత్వం పొట్టనపెట్టుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద వర్గాలకు చెందిన వారే ఎలా చనిపోతారని నిలదీశారు ఆయన.  అందుకే రాబోయే ఎన్నికల్లో పేదలందరూ ఏకమై కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడించి, తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

చిరంజీవి కుటుంభానికి కోటి నష్ట పరిహారం ఇవ్వాలి..

చిరంజీవి హత్యకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిరంజీవి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు బిఎస్పి పోరాడుతుందని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందజేయాలని, చిరంజీవి సతీమణికి ఉపాధి కల్పించాలని, పిల్లలను ప్రభుత్వమే పిజి వరకు చదివించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని పేర్కొన్నారు. మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కెసిఆర్ అన్ని విషయాల్లో మౌనంగా ఉన్నట్లు ఈ విషయంలో మౌనంగా ఉండద్దని కోరారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లింగం,నియోజకవర్గ నాయకులు సాయికృష్ణ,బిఎస్పి రాష్ట్ర నాయకులు గుండెల ధర్మెందర్,అబెందర్,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి,గుడ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking