అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలం : చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున (ఏ రోజుముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 11న ఈ కుంభోత్సవం నిర్వహించబడుతుంది.
అమ్మవారికి సాత్మికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలగునవి సమర్పించడం ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతోంది.
ఇందులో భాగంగా మంగళవారం అనగా రోజున అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించడం జరిగింది. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించబడ్డాయి.