జర్నలిస్టు నేత నర్సింగ్ రావు ఆనారోగ్యంతో ఆత్మహత్య
– సంతాపం ప్రకటించిన హౌసింగ్ సొసైటీ, టీడబ్ల్యూజేఎఫ్.
నిర్దేశం, హైదరాబాద్ :
గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి, ఈనాడు రిపోర్టర్ ఎర్రం నర్సింగ్ రావు గారు సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందారు.
ఈ విషాదకర సంఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ముప్పై ఏళ్ళుగా ఈనాడు దినపత్రికలో లోకల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న నర్సింగ్ రావు జర్నలిస్టు ఫెడరేషన్ వ్యవస్థాపనలో ప్రధాన పాత్ర వహించారు. సంఘం తరపున తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ కు నర్సింగ్ రావు గారు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గా, హౌసింగ్ సొసైటీకి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతకుముందు హైదరాబాద్ జర్నలిస్ట్స్ యూనియన్ కార్యదర్శి గా పని చేశారు. సంఘం బాధ్యుడిగా జర్నలిస్టుల సమస్యలపై చిత్త శుద్ధితో, అంకిత భావంతో నిస్వార్థంగా పని చేశారు. వృత్తి పట్ల కూడా అంకితభావంతో పనిచేశారు. గత రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురయ్యారు.
ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. నిరంతరం మెడిసిన్ వాడుతూ అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి ఆదివారం రాత్రి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున హఠాత్తుగా మృతి చెందారు.
నర్సింగ్ రావు కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నర్సింగ్ రావు మృతికి గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, సంతాపం తెలియజేస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నర్సింగ్ రావు సొసైటీకి, ఫెడరేషన్ సంఘానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం జర్నలిస్టుల పోరాటానికి తీరని లోటని పేర్కొన్నారు.