మంత్రి ప్రశాంత్ రెడ్డికి ‘అమ్మ’ అగ్ని పరీక్ష
అతను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి.. అతనికి తల్లి అంటే ప్రాణమిచ్చెంత ప్రేమ.. ఆ ప్రేమకే పరీక్ష పెట్టింది విధి.. నిజమే.. అమ్మంటే ఓ అనుబంధం…. అమ్మంటే ఓ అనురాగం… ఆత్మీయత. సృష్టిలో అమ్మను మించిన అపురూపం మరోటి లేదని నమ్ముతాడు మంత్రి. అయినా.. అతనికి అమ్మ ఆనారోగ్యం అగ్ని పరీక్షలా మారింది.
ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల బిజీ.. మరో వైపు అమ్మ ఆనారోగ్యం.. వీటి మధ్య రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి. పైకి నవ్వుతూ కనిపించే అతని హృదయమంతా అమ్మనే.. అమ్మ ఆరోగ్యవంతురాలు కాదనే పిడుగులాంటి వార్త అతనిని కృంగ దీస్తుండగా మరోవైపు సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల రణరంగంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మంత్రి ప్రశాంత్ రెడ్డి తండ్రి వేముల సురేందర్ రెడ్డి కూడా ఆనారోగ్యంతో ఏడేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి తల్లి మంజుల మానసికంగా కృంగి పోయింది. ఆనారోగ్యం పాలైంది. గతంలో బ్రేయిన్ ట్యూమర్ సర్జరీ చేపించాడు కుమారుడు ప్రశాంత్ రెడ్డి. తల్లి ఆరోగ్యవంతురాలైందని సంతోష పడ్డాడు. మళ్లీ ఏడాదిన్నర నుంచి ఆనారోగ్యంతో ఉంది. రెండు నెలలుగా ఆమె హాస్పిటల్ లో సీరియస్ కండిషన్ లో ఉంది. తల్లి పరిస్థితి విషమించిందనే సమాచారంతో పది రోజుల క్రితం బాల్కొండ నియోజక వర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలను అర్ధంతరంగా వదిలేసి తల్లి కోసం హైదరాబాద్ వచ్చారు మంత్రి.
ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ హాస్పిటల్ లో తల్లి మంజులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయినా.. ఆ తల్లి ఆరోగ్యంలో మార్పు లేదు. ఐసీయూలో వెంటిలెటర్ పై అక్సిజన్ తో జీవచ్చలా ఉన్న తల్లిని చూసి కలత చెందుతున్నాడు మంత్రి.
– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్