వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు

వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు

వరంగల్, నిర్దేశం:
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య సవాళ్లు, వార్నింగులు సహజమే.. అయితే అక్కడ పరిస్థితి డిఫరెంట్‌గా కనిపిస్తోంది. తలతిక్క వేషాలు వేస్తే ఊరుకునేది లేదు. నా అనుచరులను డిస్టర్బ్ చేస్తే సహించేది లేదు.. ఇది ఓ ఎమ్మెల్యే తన సొంత పార్టీ నేతకు బహిరంగంగా ఇచ్చిన వార్నింగ్. ఈ వార్నింగ్ తో ఆ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దీంతో పార్టీలో ఏం జరుగుతోందో అంటూ చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఈ మాస్ వార్నింగ్ ఇచ్చిందెవరు..? ఆయనకు ఎందుకని అంత కోపం వచ్చింది? ఓరుగల్లు రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాలు సహజం. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం తన సొంత పార్టీ నాయకునికి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చి పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. కీలక సంస్థల ప్రధాన కార్యాలయాలు , వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ భవనాలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే ఉన్నాయి.అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ పశ్చిమ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆశావహులు భారీ స్థాయిలో పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 15 మంది నాయకులు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు.

హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డిల మధ్య టికెట్ పోరు రసవత్తరంగా సాగింది. వరంగల్ పశ్చిమలో తనకు టికెట్ ఇవ్వకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని బహిరంగంగానే జంగా రాఘవరెడ్డి తన అసంతృప్తి వెళ్ళగక్కారు.అయితే చివరకు అధిష్టానం జంగా రాఘవరెడ్డిని కాదని నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. డీసీసీ పదవి విషయంలోనూ గతంనుండే జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి ల మధ్య వర్గ పోరు నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో నాయిని రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించడంతో జంగా రాఘవరెడ్డి సైలెంట్ అయ్యారు. పార్టీకి డామేజ్ జరగద్దని భావించిన అధిష్టానం జంగా రాఘవ రెడ్డికి పామ్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పదవి కట్టబెట్టింది.ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జంగా రాఘవరెడ్డి అనుచరులు గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా వేదికగా పార్టీకి నష్టం కలిగేలా ప్రచారం సాగిస్తున్నారట. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారట. గత పది ఏళ్ల కాలంలో పార్టీ అధికారంలో లేకున్నా అందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నాడని తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీకి సేవ చేశారని మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తున్నారట. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కారణంగా జంగాకు టికెట్ ఇవ్వలేదని మరోసారి అవకాశం ఇస్తామని హైకమాండ్ బుజ్జగించిందని..అందుకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ సేవల గ్రూపులో ప్రచారం చేస్తున్నారట.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రచారం చేయడమే కాకుండా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ కేడర్ను రెండు వర్గాలుగా చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని నాయని అనుచరుు చెప్పుకుంటున్నారు. జంగాకి ఎమ్మెల్సీ పదవి వస్తే మళ్లీ కాంగ్రెస్ క్యాడర్ రెండుగా చీలిపోతుంది అని ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో పార్టీ మనుగడకే మోసం వస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.గత ఎన్నికలకు ముందు సైతం జంగా రాఘవరెడ్డి టిఆర్ఎస్ నేతలకు అమ్ముడుపోయారని కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నించారని నాయని రాజేందర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో సైతం సొంత పార్టీ అభ్యర్థి అయిన నాయిని రాజేందర్ రెడ్డి ఓటమి కోసం టిఆర్ఎస్ అభ్యర్థితో చేతులు కలిపాడని ఆరోపిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే పార్టీని సర్వనాశనం చేస్తాడని జంగా రాఘవరెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.కాజీపేట పరిధిలోని కొంతమంది నాయకులు జంగా రాఘవరెడ్డి అనుకూలంగా ప్రచారం చేస్తుండడంతో విషయం తెలుసుకున్న నాయని తీవ్రంగా ఫైర్ అయ్యారు. టిఆర్ఎస్ తో చేతులు కలిపి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని కాంగ్రెస్ కేడర్ను అయోమయానికి గురి చేస్తున్నారని జంగా రాఘవరెడ్డిని తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. అంతేకాకుండా తనకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై తన వెనుక గోతులు తీస్తున్నారని దుయ్యబట్టారు. ల్యాండ్ కబ్జాలు, సెటిల్మెంట్లు లేకుండా ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో తిరిగి దందాలు మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని.. ఇలా చేస్తే సహించేది లేదని జంగా రాఘవరెడ్డి అనుచరులకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు.మొత్తమ్మీద ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి మధ్యలోని వర్గపోరు, ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బహిరంగంగా జంగా రాఘవరెడ్డి, అతని అనుచరులకు వార్నింగ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుందోననే ఉత్కంఠ మొదలైంది. స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ ఇద్దరి మధ్య వర్గ పోరు ఎక్కడికి దారితీస్తుందోననే చర్చ నడుస్తోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »