మరింత పెరిగిన హెచ్ఎండీఏ పరిధి
హైదరాబాద్, నిర్దేశం:
హైదరాబాద్ విస్తరణపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ తాజాగా హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. HMDA స్థానంలో కొత్తగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ను తీసుకొచ్చింది. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు చుట్టూ.. తెలంగాణ ముఖచిత్రం మార్చేలా రీజనల్ రింగు రోడ్డు ప్రాజెక్టు పట్టాలెక్కిస్తుండటంతో భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని నగర పరిధిని విస్తరించారు. అందులో భాగంగానే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం హెచ్ఎండీఏ విస్తీర్ణం 7,257 చదరపు కిలోమీటర్లు ఉంది. 7 జిల్లాలు, 74 మండలాలు, సుమారు 1000 గ్రామపంచాయతీలు, ఎనిమిది కార్పొరేషన్లు, 38కి పైగా మన్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. తాజాగా.. మరో 3 వేల చదరపు కిలోమీటర్లు విస్తరస్తూ.. హెచ్ఎంఆర్ పరిధిని 10,472.72 చదరపు కిలోమీటర్లగా నిర్ణయించారు. హెచ్ఎంఆర్ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న HMDA పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటుగా కొత్తగా నల్గొండ, వికారాబాద్, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలను చేర్చారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 533 రెవెన్యూ గ్రామాలున్నాయి. అతి తక్కువగా నాగర్కర్నూల్ జిల్లాలో మూడు గ్రామాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలో రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వాటికి అదనంగా కొత్త గ్రామాలు హెచ్ఎంఆర్లో కలిపారు.జిల్లాల వారీగా గ్రామాలు చూసుకుంటే.. రంగారెడ్డి జిల్లాలో 533, మేడ్చల్-మల్కాజిగిరి163, యాదాద్రి-భువనగిరి 162, సంగారెడ్డి 151, మెదక్ 101, సిద్దిపేట 74, హైదరాబాద్ 64, వికారాబాద్ 54, నల్గొండ 31, మహబూబ్ నగర్ 19, నాగర్ కర్నూల్ 3 గ్రామాలతో కలిపి మెుత్తం 1,355 గ్రామాలు హెచ్ఎంఆర్ పరిధిలో ఉండనున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే హెచ్ఎంఆర్ పరిధితో ఆయా మండలు, గ్రామాల్లో భూములకు రెక్కలు రానున్నాయి. నగర శివారు ప్రాంత భూములకు ఇప్పటికే డిమాండ్ లక్షలు, కోట్లలో ఉండగా.. కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకే ఛాన్స్ ఉంది.
డబుల్ డెక్కర్ కారిడార్
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మౌళిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య కాగా.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే నగరంలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్పాసులు నిర్మించారు. ఇక ఉత్తర తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నగరంలోకి ఈజీగా చేరుకునేందుకు జాతీయ రహదారి 44పై సికింద్రాబాద్ జంక్షన్ ప్యారడైజ్ నుంచి తాడ్బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీఫాం వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ ఇప్పటికే ఈ పనులకు శంకుస్థాపన చేశారు.తాజాగా ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ఎలివెటేడ్ కారాడార్ నిర్మాణంలో భాగంగా.. బేగంపేట వద్ద సొంరగం నిర్మించాల్సి ఉంది. ఈ టన్నెల్ మార్గం పనులకు ఎయిర్పోర్టు అథారిటీ నుంచి తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొత్తం కారిడార్ పొడవు 5.40 కిలోమీటర్లు కాగా.. ఇందులో టన్నెల్ మార్గం 0.6 కిలోమీటర్లు ఉండనుంది. బోయినపల్లి కూడలి నుంచి బాలంరాయి రోడ్డును కనెక్ట్ చేస్తూ ఈ సొరంగ మార్గం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఎలివేటెడ్ కారిడార్ కోసం ప్రైవేటు ఆస్తులను అధికారులు గుర్తించారు. త్వరలో బాధితులకు నష్టపరిహారం అందజేయనున్నారు. రోడ్డుకు రెండు వైపులా 200 మీటర్ల వరకు వెడల్పు చేయాల్సి ఉంది. దీంతో ఆ మేరకు ఆస్తులను అధికారులు గుర్తించారు. కంటోన్మెంట్లో రక్షణశాఖ ఆస్తులను కూడా హెచ్ఎండీఏకు అప్పగించే ప్రక్రియ జరుగుతోంది.కాగా, నేషనల్ హైవే 44పై రూ.1,580 కోట్ల వ్యయంతో ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి తాడ్బండ్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫామ్ రోడ్డు వరకు 5.40 కిలోమీటర్ల డబుల్డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, జేబీఎస్ నుంచి శామీర్పేట ఔటర్ రింగు రోడ్డును కలుపుతూ 18.1 కిలోమీటర్ల మేర మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ రూట్లలో వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రస్తుతం నగరం నుంచి బయటకు వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే 3 నుంచి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ జాతీయ రహదారి వైపు ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.