ఏపీలో ఫేస్ పే టెక్నాలజీ…
విజయవాడ, నిర్దేశం:
వేగంగా సేవలు అందించడానికి బ్యాంకులు ఎన్నో వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయినా క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సరికొత్త ఆలోచన చేసింది. ఫేస్ పే యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.టెక్నాలజీ ఇంత పెరుగుతున్నా.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు పొందడానికి ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుల్లో గంటల తరబడి నిలబడుతున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వ పథకాల నిధులు విడుదలైన సమయంలో రద్దీ విపరీతమైన ఉంటోంది. ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చేందుకు ఏపీ గ్రామీణ బ్యాంకు.. కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్ పే పేరుతో.. ఓ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఖాతాదారులు రెండు నిమిషాల్లోపే బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్లవచ్చని అధికారులు చెబుతున్నారు.సాధారణంగా ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లి విత్ డ్రా ఫామ్ నింపి, కౌంటరులో ఇచ్చాక డబ్బులు తీసుకునేందుకు సమయం పడుతోంది. చదువురాని వారైతే.. మరొకరితో ఫామ్ నింపించుకోవాల్సి వస్తోంది. అప్పుడప్పుడు రాసే వారు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు ఫేస్ పే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉన్నవారు.. ఈ యంత్రం వద్ద నిల్చుంటే అందులోని కెమెరా ఆన్ అవుతుంది. అకౌంట్ నంబరు ఎంటర్ చేయాల్సిన పని లేదు. యంత్రం ఖాతాదారు ముఖాన్ని గుర్తించి వారి ఖాతాలో ఎంత సొమ్ము ఉందో చెబుతుంది. ఎంత కావాలో నమోదు చేయగానే.. వారి పేరుతో వోచర్ వస్తుంది. దీన్ని సరిచూశాక ఓకే అనే బటన్ నొక్కితే.. యంత్రం నుంచి ప్రింట్ వస్తుంది. దానిపై సంతకం లేదా వేలిముద్ర వేసి కౌంటర్లో ఇస్తే నగదు ఇస్తారు.ఫేస్ పే యంత్రాలను ప్రయోగాత్మకంగా ప్రస్తుతం పది శాఖల్లో ఏర్పాటు చేశామని.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ ప్రమోద్కుమార్ రెడ్డి వెల్లడించారు. ఖాతాదారుల ఫొటో డేటా ఆధారంగా ఇవి పని చేసేలా సాంకేతిక బృందం రూపొందించిందని వివరించారు. భవిష్యత్తులో ఏటీఎం తరహాలో డబ్బులు తీసుకునేలా సాంకేతికత అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు సులభంగా నగదు తీసుకోవచ్చు అని స్పష్టం చేశారు.దేశంలో కొన్ని బ్యాంకులు, సంస్థలు ఈ సాంకేతికతను ప్రవేశపెడుతున్నాయి. దీని ద్వారా కార్డులు లేదా ఫోన్ అవసరం లేకుండానే నగదు తీసుకోవచ్చు. ఇది వేగవంతమైనదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇది సురక్షితమైనదని అంటున్నారు. ప్రత్యేకించి డేటా సురక్షితంగా ఉంటుందని.. మోసపూరిత ప్రయత్నాలను నిరోధిస్తుందని వివరిస్తున్నారు. కళ్ల మధ్య దూరం, ముక్కు ఆకారం మొదలైనవి ఈ యంత్రం గుర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు.