రాజకీయ వర్గాలలో ఎలక్టోరల్ బాండ్ల చర్చ
నిర్దేశం, హైదరాబాద్ :
ఎలక్టోరల్ బాండ్లు.. రాజకీయ వర్గాలలో పెద్ద చర్చగా మారింది. చట్టం తెలిసిన విద్యావంతులు సైతం పొలిటికల్ పార్టీలకు డబ్బులు ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఎలక్టోరల్ బాండ్లను నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ అంశం పెద్ద దుమారం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్, అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మని ఇద్దరు వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్ల పేరుతో రూ.2.5 కోట్ల మేర మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.తప్పు చేసినోళ్లను తీర్పుల ద్వారా శిక్షలు వేసే న్యాయమూర్తియే స్వయంగా ఎలక్టోరల్ బాండ్లను బీజేపీకి ఇచ్చే ప్రయత్నంలో మోసగాళ్ల చేతిలో నష్ట పోవడం చర్చనీయంశంగా మారింది.
ఓ రాజకీయ పార్టీ పేరుతో మోసగాళ్లు డబ్బులు అడిగారని, తనతో పాటు తన మనవళ్లను అమెరికాలో మర్యాదగా ఉంచుతామని హామీ ఇచ్చి మోసం చేశారని డీఎస్ఆర్ వర్మ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ న్యాయమూర్తి వర్మ ఫిర్యాదుతో ఫిల్మ్ నగర్ పోలీసులు మాజీ జడ్జి నుంచి రూ.2.5 కోట్లు వసూలు చేసిన నరేంద్రన్, శరత్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై నమ్మక ద్రోహం, మోసం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫిర్యాదుదారు ప్రకారం, తన బంధువులకు తెలిసిన నరేంద్రన్, రాజకీయ పార్టీ కోసం కొంత మొత్తాలను కోరాడు. అది బాండ్ల ద్వారా గుర్తించబడుతుందని చెప్పాడు. శరత్ రెడ్డి మాటలు నమ్మి తన కుమార్తెలు, భార్య 2021లో అప్పుడప్పుడు బ్యాంకు ద్వారా రూ.2.5 కోట్లు పంపించారని రిటైర్డ్ జడ్జి పోలీసులకు తెలిపారు. 2.5 కోట్లు వసూలు చేసినప్పటికీ, వారు బాండ్లను జారీ చేయలేదని, యుఎస్లోని తన మనవళ్లకు ఎటువంటి సహాయం చేయలేదని ఆయన తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించడంతో రిటైర్డ్ జడ్జి పోలీసులను ఆశ్రయించారు.
అయితే.. ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్లు కార్పొరేట్ సంస్థలు పొలిటికల్ పార్టీలకు విరాళంగా ఇచ్చాయి. కానీ.. రిటైర్డ్ న్యాయమూర్తి స్వయంగా పొలిటికల్ పార్టీ పేరుతో తాను ఎలక్టోరల్ బాండ్లకు డబ్బులు ఇచ్చామని ఫిర్యాదు చేయడమే విచిత్రంగా ఉంది.
ఇలా ఇంకెంతా మంది పొలిటికల్ పార్టీలకు విరాళాలు ఇచ్చారో ఈ నెల 13న తేలనుంది. అలాగే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొందరు వ్యక్తులు కూడా ఇలానే అధికార బీఆర్ ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల పేరుతో డబ్బులు ముట్ట చెప్పినట్లు సమాచారం.