బీఆర్ఎస్కు చావు దెబ్బే..!
సొంత నేతలు భారీ స్కెచ్
బీజేపీలో చేరుతున్న సిట్టింగ్ ఎంపీలు
ఢిల్లీలో జరిగిన కోర్ కమిటీ భేటీతో తేటతెల్లం
మరికొందరు కాంగ్రెస్ వైపు పయనం
నేడో, రేపో చేరేందుకు రంగం సిద్ధం
(ఈదుల్ల మల్లయ్య)
బీఆర్ఎస్ పుట్టి మునుగుతోంది. ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గులాబీ దళంలో కీలక పరిణాలు చోటుచేసుకుంటున్నాయి. సొంత పార్టీ కీలక నేతలే పార్టీని చావుదెబ్బ తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీ బాట పడుతున్నారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చావు దెబ్బ కొట్టేందుకు సొంత సిట్టింగ్ ఎంపీలు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని, అవగాహన ఒప్పందంతో కలిసే పోటీ చేయబోతున్నాయని ప్రచారం విస్తృతం కావడంతో పలువురు కీలక నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ఇప్పుడు మునిగిపోయిన నావ అని భావించి బీజేపీలో, కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం సైతం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శనివారం అమిత్ షా, జేపీ నడ్డాతో తెలంగాణ కోర్ గ్రూప్ నేతలు చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది.
నాలుగు సిట్టింగ్ స్థానాలతో పాటు మొత్తం 17 స్థానాల ఎంపికపై కసరత్తు చేశారు. ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో కోర్గ్రూప్ జాబితా సిద్ధం చేసి అధిష్టానానికి పంపింది. మొత్తం 17 స్థానాలకు 50 పేర్లతో తయారు చేసిన జాబితాను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైకమాండ్ ముందు పెట్టారు.
అనంతరం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న సిట్టింగులపై ఫోకస్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి దింపేందుకు బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్దండుల్ని సైతం ఇంటికి పంపించేయాలన్న లక్ష్యంతో అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం.
కాంగ్రెస్లో చేరికలు..
మరోవైపు బీఆర్ఎస్లో కొందరు సిట్టింగ్ ఎంపీలు హస్తం గూటికి చేరేందుకు హస్తినలో ముమ్మరంగా భేటీలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే ఈసారి నట్టేట మునగడం ఖాయమని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతూనేఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెకస్లో చేరారు. ఆదివారం గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో ఆరుగురు కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పి మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం బీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు గుడ్బై చెప్పిన విషయం విదితమే.