ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఇరకాటం
– రెండు స్థానాలకు బీఆర్ఎస్ పోటీ
నిర్దేశం, హైదరాబాద్ :
తెలంగాణలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ పోస్టుల్లో రెండు పోస్టుల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమయినట్లు తెలిసింది. ఎర్రవెల్లిలో నేతలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలంటే రెండుస్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ చేసినట్లు తెలిసింది. నిజానికి ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానం బీఆర్ఎస్ కు దక్కుతుంది.
ఎమ్మెల్యే కోటాకు జరిగే ఎన్నికలు కావడంతో బలాబలాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ కు ఉన్న బలాన్ని బట్టి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సులువుగా గెలుచుకుంటుంది. అయితే కాంగ్రెస్ ను రాజకీయంగా ఇబ్బందుల్లో పెట్టేందుకు రెండో స్థానంలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలంటే పది మంది ఎమ్మెల్యేల సంతకాలతో ప్రతిపాదించాల్సి ఉంటుంది.
అయితే బీఆర్ఎస్ కు అంత బలం ఉండటంతో ఇద్దరి చేత నామినేషన్ వేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. 21 మంది సభ్యులుంటే ఒక స్థానం గెలుచుకునే వీలుంది. బీఆర్ఎస్ కు సాంకేతికంగా ఒక స్థానం మాత్రమే లభిస్తుంది. పది మంది ఎమ్మెల్యేలు జంప్ కావడంతో పాటు ఇద్దరిని గెలిపించుకునే బలం లేకపోయినా పోటీకి దిగి కాంగ్రెస్ పార్టీని కొంత మేరకు కంట్రోల్ లో పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో రెండు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండటంతో అభ్యర్థులు రేపు నామినేషన్లు వేసే అవకాశముంది.
పోటీలో ఆర్ ఎస్ ప్రవీణ్ లేదా సత్యవతి రాథోడ్
అందులో ఒక స్థానానికి సత్యవతి రాథోడ్ పేరు ఖరారయిందని తెలిసింది. సత్యవతి రాథోడ్ తో పాటు మరో స్థానానికి దాసోజు శ్రావణ్ పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. దాసోజు శ్రావణ్ కు గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా అది దక్కకపోవడంతో తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కానీ కేసీఆర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే బెటరని, బీఆర్ఎస్ గొంతును బలంగా మండలిలో వినిపిస్తారని, సామాజివర్గాల సమీకరణల ప్రకారం కూడా ప్రవీణ్ కుమార్ బెస్ట్ అని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ముగ్గురి పేర్లలో రెండింటిని ఈరోజు, రేపట్లో అధికారికంగా బీఆర్ఎస్ ప్రకటించే అవకాశముంది.