16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 42 ఏళ్ల వ్యక్తి!
అనంతపురం, నిర్దేశం:
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లో 42 ఏళ్ళ వయసున్న ఓ వ్యక్తి 16 ఏళ్ల యువతిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇష్టం లేని ఆ బాలిక తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా భర్త చనిపోయి పుట్టింట్లో ఉంటుంది. రెండో కుమార్తె మైనర్. వీరి కుటుంబం ఆర్థిక స్థితిగతులు ఆసరాగా చేసుకున్న గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు ఆ బాలికను రెండో వివాహం చేసుకున్నాడు. అతని భార్య రెండేళ్ల కిందటే మృతి చెందింది. అతనికి వివాహమైన ఓ కుమారుడు, పెళ్లి కావాల్సిన ఓ కుమార్తె ఉన్నారు. రెండో వివాహం ఏప్రిల్ 16వ తేదీన పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి ఇష్టం లేని బాలిక వారం రోజుల్లోనే పుట్టింటికి చేరింది. మే 24న రామాంజనేయులు తన బంధువులతో బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లి, తండ్రి, సోదరిపై దాడి చేసి బాలికను తీసుకెళ్లారు. రెండు రోజులపాటు ఇష్ణారాజ్యంగా కొట్టడంతో దెబ్బలు భరించలేని ఆ బాలిక ఆదివారం రాత్రి తప్పించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. అర్ధరాత్రి ఒంటరిగా పొలాల వెంబడి నడుచుకుంటూ వచ్చి ఓ చోట నిద్రించింది. సోమవారం ఉదయం స్థానికుల సహాయంతో అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం చేరుకుని తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. అధికారుల కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయం బాలిక, తల్లి సోదరి రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసులు నిందితుడు రామాంజనేయులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయమై రామాంజనేయులు కుటుంబ సభ్యులు బంధువులు మాత్రం ఇది తప్పుడు కేసు అని చెబుతున్నారు. బాలిక మైనర్ కాదని, ఆమెకు 18 సంవత్సరాల ఐదు నెలలు ఉన్నాయని, రామాంజనేయులు వయసు 42 సంవత్సరాలు అని తెలిపారు. మొదటి భార్య చనిపోవడంతో ఆయన బంధువుల అమ్మాయి కావడంతో యువతిని రెండో వివాహం చేసుకున్నాడని చెప్పారు. బాలిక తల్లిదండ్రులు, అమ్మాయి అంగీకారంతోనే కుటుంబ సభ్యులు బంధువులు, వారి కులస్తుల అంగీకారంతో రెండవ వివాహం ఘనంగా జరిపించారని వెల్లడించారు.పెద్దల సమక్షలో మూడు రోజులపాటు పెళ్లి వేడుకలు నిర్వహించామని రామాంజనేయులు తరఫు వారు తెలిపారు. అమ్మాయికి రూ. 2 లక్షల రూపాయలు డబ్బులు, ఒక తులం బంగారు నగలు సమర్పించి అందరి సమక్షంలో వివాహం జరిపించామన్నారు. వివాహం అయిన తర్వాత ఆ యువతి భర్త ఇంటికి కాపురానికి రాకపోవడంతో తాము తీసుకెళ్లామని, బలవంతంగా తీసుకెళ్ల లేదని తెలిపారు. అమ్మాయి మేజర్ అని, ఆమెకు 18 ఏళ్లకు పైగా వయసు ఉందని ఆధార్ కార్డ్ చూపించిన తరువాతే పెళ్లి జరిపించినట్లు నిందితుడి కుటుంబం తెలిపింది. బాలిక ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు నిందితుడు రామాంజనేయులపై ఫోక్సో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో అసలు నిజాలు బయటకు రానున్నాయి.