27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
19న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
27 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
నిర్దేశం, హైదరాబాద్:
బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదాపడింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. శాసనసభ భవనంలోని స్పీకర్ చాంబర్లో జరిగిన సమావేశంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు తీర్మానించారు. గురువారం (13న) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనున్నది. 14న హోలీ పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఉంటుంది. 15 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. 16న ఆదివారం సెలవు ఉంటుంది. 17, 18 ప్రభుత్వ బిజినెస్ ఉంటుందని.. రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 19న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతారు. 20న సెలవు, 21న బడ్జెట్పై సాధారణ చర్చ ఉంటుంది. 22, 24, 25, 26 పద్దులపై, 27 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగనున్నది.