గవర్నర్ కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, నిర్దేశం:
గవర్నర్ ప్రసంగం పెండ్లిలో చావు డప్పు కొట్టినట్లు ఉన్నది – బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేటీఆర్ కామెంట్స్ కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగాన్ని అవమాన పరిచే విదంగా కేటీఆర్ మాట్లాడ్డం ఆయన అహంకారానికి పరాకాష్ట. అధికారం పోయి రోడ్డు మీద పడ్డా కూడా కేటిఆర్ కు అహంకారం పోలేదు. గవర్నర్కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. గవర్నర్లను అవమానించిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు. దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చూడు కేటీఆర్. కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు. రైతు రుణ మాఫీ లెక్కలు తెలియకుండా కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుస్తుంది. కేసిఆర్ కుటుంబం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం, మేడిగడ్డ నాణ్యత ఏంటో బయపడినా మళ్లీ వాటి గురించి మాట్లాడడం కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం.
కేసిఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ఒక ఏటీఎంలా ఉపయోగపడింది. కులగణనలలో తప్పుడు లెక్కలు చెబుతున్నామని అంటున్న మీరు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎందుకు బహిర్గతం చేయలేదు..? కేసిఆర్ ఇప్పటికైనా ప్రతి పక్షనేతగా అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతిపక్ష నేతగా కేసిఆర్ అసెంబ్లీ హాజరై … ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తే బెటర్. రైతు ఆత్మహత్యల గురించి కేటీఆర్ మాట్లాడటానికి సిగ్గుండాలి, బిఆర్ఎస్ పాలనలో దేశంలోనే రైతు ఆత్మహత్యలలో తెలంగాణ రెండో స్థానంలో ఉండేది. బిఆర్ఎస్ పాలనలో రైతన్నలు వరికుప్పల మీద పడి చనిపోయిన ఘటనలు ఇంకా కళ్ళముందే కదలడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసిఆర్ కుటుంబం లక్ష కోట్లు దండుకుంది. కుల గణన సర్వేలో పాల్గొనకుండా సర్వేను తప్పు పట్టే అర్హత కేటీఆర్ కు లేదు. చారిత్రాత్మక నిర్ణయాలైన కుల గణన ,ఎస్సీ వర్గీకరణ చేసినందుకు అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడానికి సిగ్గుండాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. పదేళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేసిన సన్నాసులు ఎవరో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో కేటీఆర్. మీరు చేసిన అప్పులకే వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి పరాకాష్ట. వరంగల్ డిక్లరేషన్ హామీకి కట్టుబడి రైతు రుణ మాఫీ చేసాము, రైతు భరోసా ఇస్తున్నాం, కాంగ్రెస్ రైతుల ప్రభుత్వం అని నిరూపించుకున్నాం. ఏడాదిలో చరిత్రలో నిలిచిపోయే కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేశాం. ఏడాదిలో 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. పదేళ్లలో కార్పొరేషన్ల ను పట్టించుకున్న పాపనపోలేదని అన్నారు.