భారత్లో మరెవర్నో గెలిపించేందుకే ఆ నిధులు..
భారత్లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు ఖర్చు చేయాలి?
బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ ఆరోపణలు
వాషింటోన్, నిర్దేశం:
భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా ప్రభుత్వం అందజేసే 21 మిలియన్ డాలర్లను ఇక నుంచి నిలిపివేస్తున్నట్టు ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిధులు నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి స్పందించారు. ఈ మేరకు గత బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల నిధులతో అక్కడున్న ‘మరెవరి’ గెలుపు కోసమో బైడెన్ పనిచేశారని ఆయన ఆరోపించారు. బుధవారం రాత్రి మియామిలో నిర్వహించిన ఎఫ్ఐఐ ప్రియారిటీ సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిధుల అంశాన్ని ప్రస్తావించారు. భారత్లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు 21 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాలి? అని ప్రశ్నించారు. ఆ దేశం (భారత్ను ఉద్దేశించి)లో మరెవర్నో గెలిపించేందుకు వారు (బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ప్రయత్నించినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. అదే కీలక ముందడుగు అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్ వద్ద చాలా డబ్బు ఉంది..
కాగా, నిధుల నిలిపివేత అంశంపై అంతకుముందు ఫ్లోరిడాలోని తన నివాసమైన మార్ ఎ లాగోలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారత్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయని.. అలాంటప్పుడు ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకు చేయాలంటూ ప్రశ్నించారు. తనకు భారత ప్రజలు, ప్రధాని పట్ల ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ‘భారత్కు 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి..? వారివద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పన్ను విధించే దేశాల్లో భారత్ ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. సుంకాల విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ను చేరుకోలేదు. కానీ, వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు మాత్రం మనం 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలా..? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఏంటి..?’ అంటూ ట్రంప్ ప్రశ్నించారు.