ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత ఉందా..
సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్, నిర్దేశం:
పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి గా నరేందర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది.ప్రభుత్వానికి, పట్టభద్రులకు వారిధి గా ఉంటారనే నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాం.బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీన పర్చాలని ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు అయన నిజామాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు.
రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించి , తెలంగాణ తో మీకు సంబంధం లేదని పేగు బంధం తెగిపోయిందని ఫామ్ హౌస్ పడుకోమని చెప్పారు. కేసీఆర్ అందుకే ఫామ్ హౌస్ లో పడుకున్నారు.. అయినా కుట్రలు ఆపలేదు. కాంగ్రెస్ ను గెలిపించి వద్దని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్లు ఏ అభ్యర్థికి ఓటు వేయాలని చెబుతున్నారు..? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ కి రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హత ఉందా..? తెలంగాణ ఉద్యమాన్ని పట్టభద్రులు ముందుండి నడిపారు. ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత ఉందా..? పది నెలలలో ఏమీ చేయలేని కాంగ్రెస్ ను అంటున్న బీఆర్ఎస్ పదేళ్లలో ఏం చేసింది..? ఎన్నికల కోడ్ కారణంగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు మాత్రమే మాకు పరిపాలన చేసే అవకాశం వచ్చింది.. పదేళ్లలో నిరుద్యోగ సమస్య కారణంగా అనేక మంది యువతీ యువకులు ఆత్మహత్య లు చేసుకున్నారు. పదేళ్లలో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే సరిపోయింది.. నోటిఫికేషన్లు రాలేదు.. నియామకాలు చేయలేదని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా..? మేం 55 వేల ఉద్యోగాలు ఇస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయండి.. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలంపిక్స్ లో బంగారు పతకం తేలేకపోయింది. ప్రపంచంతో పోటీ పడలేక పోతున్నామనే తెలంగాణ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిజామాబాద్ కు చెందిన నిక్కత్ జరీన్ కు రెండు కోట్ల నగదు ఇచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ గా నియమించింది నిజమైతే కాంగ్రెస్ కు ఓటు వేయాలి. భారత బౌలర్ సిరాజ్ కు అన్ని మినహాయింపులు ఇచ్చి గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చాం. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వం ఆదుకుంటుందని నిరూపించాం.
వరంగల్ కు చెందిన కీర్తి కి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి 25 లక్షల ఆర్థిక సాయం చేశాం. నిజామాబాద్ రైతులు దేశానికి తలమానికం.. నిరసనలతో ప్రభుత్వాలను గడగడలాడించడంలో నిజామాబాద్ రైతులు ముందుంటారు. ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయాలి. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి యేడాదికి 12 వేలు ఇస్తున్నాం. నిజామాబాద్ లో కాంగ్రెస్ అనేక ప్రాజెక్టులు తీసుకురావడం వల్లనే పసిడి పంటలు పండుతున్నాయి. సన్న వడ్ల కు 500 రూపాయలు బోనస్ ఇస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయాలి . ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటు ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నాం. 8 వేల కోట్లు తీర్చడానికి నా నడుము వంగిపోతోంది. ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు పోయి పడుకుంటే బకాయిలు ఇవ్వడానికి మాకు చాలా కష్టం అవుతుంది. ప్రతి నెలా వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించడానికి ప్రయత్నం చేస్తాం. మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్. బండి సంజయ్.. ఆకాశమంత ఎగిరి దూకుతున్నడు. బడా బీసీలమని బండి సంజయ్, మోదీ చెపుతున్నారు. 2021 లో బీజేపీ జనగణన ఎందుకు చేయలేదు.. అందులో కులగణన చేయలేదు. వందేళ్లలో బీసీ కులగణన చేయకపోతే మీ రేవంత్ రెడ్డి నెలలో కులగణన చేసి లెక్కలు ముందు పెట్టాడు. 100 యేళ్ల కులగణన సమస్యను నేను తీర్చాను. వండుకున్న అన్నం లో ఉప్పు వేసి తినకుండా చేయడానికి బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారు. బలహీన వర్గాలకు లెక్క తప్పు అయితే బండి సంజయ్.. ఎత్తి చూపించాలి.. సొల్లు వాగుడు వాగడం కాదు. సమగ్ర కుటుంబ సర్వే అనే చిత్తు కాగితాన్ని చూపిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ కు చట్టం చేసి మంత్రివర్గంలో ఆమోదించాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి కాదా..? వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ కు ఓటు వేయాలి. సమస్యకు పరిష్కారం చూపించిన నా వైపు దళిత సోదరులు నిలబడాలి. శానసమండలి లో పట్టభద్రుల సమస్య ను ప్రస్తావించి పరిష్కరించే నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కావాలని అన్నారు.