రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు
కలెక్టర్ లతో టెలీకాన్ఫరెన్స్..
హైదరాబాద్ మార్చి,29:(వైడ్ న్యూస్) : ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్షించి, తదుపరి మిగత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశానికి ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు , రెవెన్యూ (డీఎం) కార్యదర్శి రాహుల్ బొజ్జా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు హాజరయ్యారు.
దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఏఈవోలతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. విమర్శలకు ఆస్కారం లేకుండా ఫూల్ ప్రూఫ్ పద్ధతిలో పంట నష్టం అంచనా వేయాలని సీఎస్ అన్నారు. బృందాలు పొలాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి త్వరగా అందజేయాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లాకు చెందిన సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని అన్నారు.
పోడు భూముల పురోగతిని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. పాసుపుస్తకాలు ముద్రించి పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జొంగ్తు తెలిపారు.