మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జీఎస్సార్..
మొగుళ్లపల్లి, నిర్దేశం:
మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శనివారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామం నుండి మహిళలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు ఎమ్మెల్యేకు బొట్టు పెట్టి, శాలువాలు కప్పి, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రోజు మహిళలందరికీ శుభ దినమని, మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని తెలిపారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయమని అన్నారు. ప్రతీ మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఉచిత ప్రయాణం నుంచి బస్సు ఓనర్లుగా మహిళలను మార్చిన ఏకైక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు. ఈరోజు పదిమందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారని అన్నారు. ఇందిరా శక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలు ప్రారంభించామని తెలిపారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.