సీఎం చేయాలని స్వర్గీయ రాజీవ్ గాంధీ అనుకున్నారు
వీహెచ్ సంచలన వ్యాఖ్యాలు
హైదరాబాద్, మే 18 : తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేయాలని అనుకున్నారని చెప్పారు. కానీ తన దురదృష్టం వల్ల సీఎంను కాలేకపోయానని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో హవా ఎక్కడుంటే రాజకీయ నాయకులు అక్కడికి రావాలని అనుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ హవా నడుస్తుందని.. అందుకే తమ పార్టీలోకి చాలా మంది రావాలని అనుకుంటున్నారని వీహెచ్ పేర్కొన్నారు.
అయితే హవా చూసి వచ్చే వారి కంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకే అవకాశాలు ఇవ్వాలని హనుమంతరావు కోరారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ కు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా చెబుతానని వీ హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్లోకి ఎవరైనా రావొచ్చని.. వచ్చిన వారికి వెంటనే పదవులు ఇవ్వకూడదని వీహెచ్ సూచించారు.