కేటీఆర్, కవితకు అగ్నిపరీక్ష
-
కామారెడ్డిలో నేతల సహాయ నిరాకరణ
-
బోధన్, అర్బన్ లలో వలసలు అరికట్టడంలో విఫలం
నిన్న, మొన్నటి వరకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కను సైగలతో పార్టీలో శాసించారు. వారు చెప్పిందే వేదం.. ఏమి చెప్పినా నాయకులు విని ఆచరించే వారు. వారి దృష్టిలో పడటానికి నానా తంటాలు పడేవారు. కానీ, ప్రస్తుతం సీను మారింది. ఎవరు చెప్పినా వినేది లేదనే స్థాయికి వచ్చారు. కేటీఆర్ అయితేనేం.. కవిత అయితేనేం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నిర్దేశం, నిజామాబాద్ :
కామారెడ్డి ఎన్నికల ఇన్ చార్జీగా మంత్రి కేటీఆర్, నిజామాబాద్ అర్బన్, బోధన్ ఇన్ చార్జీగా ఎమ్మెల్సీ కవిత నియమితులయ్యారు. వీరిద్దరు ఇన్ చార్జీలుగా నియమితులు కాగానే ఈ మూడు నియోజక వర్గాలలో బీఆర్ ఎస్ ఖాతలోకే అని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ, పరిస్థితులు అందుకు భిన్నంగా తయారయ్యాయి. ఈ నాయకులు ఇద్దరు ఆయా నియోజక వర్గాలలో అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. చెప్పినట్లు వింటారనుకున్న క్యాడర్ వీరికి చుక్కలు చూయిస్తున్నారు. అది కూడా ఈ మూడు నియోజక వర్గాలలోనే ద్వితీయ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి బయట పడటం గమనార్హం. సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి నియోజక వర్గంలో ముఖ్య నాయకులే అంటిముట్టనట్లు ఉంటున్నారు. వీరికి పలుమార్లు కేటీఆర్ క్లాస్ తీసుకున్నారు. ప్రగతి భవన్ కు కూడా పిలిపించుకుని మాట్లాడారు. అయినప్పటికీ నేతల్లో మార్పు రాలేదు. కొంత మంది కౌన్సిలర్ లు, సర్పంచ్ లు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వరకే కొన్ని సామాజిక వర్గాలు బీఆర్ ఎస్ కు వ్యతిరేకం కాగా, తాజాగా క్యాడర్ సైతం అసంతృప్తితో ఉండటం గమనార్హం.
అర్బన్, బోధన్ లలో వలసలు
నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజక వర్గాలలో వలసలను అరికట్టలేక పోతున్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ చైర్ పర్సన్ పద్మ భర్త శరత్ రెడ్డికి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. రాజీ కుదుర్చడానికి అధిష్ఠానం చర్యలు తీసుకోలేదు. ఇటీవల శరత్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పద్మ పలువురు కౌన్సిలర్ లు, సర్పంచ్ లు ముఖ్య నాయకులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలో ఆకుల లలిత టికెట్ ఆశించారు. 2018 ఎన్నికల సమయంలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉండగా, మళ్లీ రెన్యూవల్ చేస్తామని హామి ఇవ్వడంతో బీఆర్ ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీ రెన్యూవల్ సాధ్యం కాక పోవడంతో మహిళా ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. పార్టీకి, కార్పోరేషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. జిల్లాలో ఈ రెండు నియోజక వర్గాలలో బీఆర్ ఎస్ పరిస్థితి బాగలేదు. కవిత ఇన్ చార్జీగా నియమితులైనందున మార్పు వస్తుందని భావించారు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేక పోవడమే కాక, బలహీనం అవుతోంది.