విద్యావిధానాల్లో మార్పు దిశగా అడుగులు
– వచ్చే ఏడాది 1 నుంచి 10 వరకు పరీక్ష విధానంలో మార్పులు
– ప్రతియేటా సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్ష
నిర్దేశం, హైదరాబాద్ః
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26)లో 1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు పరీక్షా విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రతీయేటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా అకడమిక్ క్యాలెండర్ ప్రకటించాల్సి ఉంది. అయితే, విద్యాశాఖ అధికారులు అకడమిక్ క్యాలెండర్ ను రూపొందించారు. ప్రతిపాదన క్యాలెండర్ ను ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రతియేటా సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్ష దసరా సెలవుల కంటే ముందే నిర్వహిస్తారు. అయితే, వచ్చే విద్యా సంవత్సరంలో దసరా సెలవుల తరువాత ఎస్ఏ-1 పరీక్ష నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ నిర్ణయించింది. ఈసారి దసరా పండుగ ముందుగా వస్తున్నందున పండుగ సెలవుల తరువాత అక్టోబర్ చివరి వారంలో ఎస్ఏ-1 పరీక్ష జరపాలని నిర్ణయించారు. ప్రతీయేటా ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పరీక్షలు నాలుగు దఫాలుగా జరుగుతాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని రెండుకు తగ్గించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవటంతో ఎప్పటిలాగే నాలుగు సార్లు ఎఫ్ఏ పరీక్షలు ఉండేలా అకడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ అధికారుల రూపొందించారు. ప్రతీయేటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు జయశంకర్ బడిబాటను జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ముందుగా నిర్వహించాలని తొలుత భావించినా.. అకడమిక్ క్యాలెండర్ లో మాత్రం యథావిధిగానే బడిబాట కార్యక్రమం నిర్వహించేలా పొందుపర్చినట్లు తెలిసింది.ప్రతిపాదన క్యాలెండర్ ను అధికారులు ప్రభుత్వానికి పంపించనున్నారు. అయితే, ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా..? ఎస్ఏ-1, ఎఫ్ఏలలో ఏమైనా మార్పులు చేస్తుందా.. యథావిధిగా అమోదం తెలుపుతుందా అనేది వేచి చూడాల్సిందే.