పుష్ప సినిమా తలపించేలా గంజాయి తరలింపు
వాహనం కింది భాగం ఖాళీ ప్రదేశంలో సరకు సంచులు
హైదరాబాద్ : పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టును రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ పోలీసులు రట్టుచేశారు. నలుగురిని అరెస్టు చేసి 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హనుమకొండకు చెందిన బానోత్ వీరన్న, హైదరాబాద్ వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్ శంకర్ నాయక్, వరంగల్కు చెందిన పంజా సూరయ్య ముఠాగా ఏర్పడి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు సీపీ డీఎస్చౌహాన్.
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమల్గిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నరని ఆయన పేర్కొన్నారు.
డీసీఎం వాహనం లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించి ఇతరులకు అనుమానం రాకుండా అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నరన్నారు. పోలీసులకు సైతం అనుమానం రాకుండా దానిపై ఇనుప షీట్లు ఉంచి బోల్టులతో బిగిస్తున్నారన్నారు సీపీ డీఎస్చౌహాన్. ఆ గంజాయిపై ఇతరు సామానులు పెట్టి లోడును తీసుకుని నగరానికి వస్తున్నరన్నారు. ఇప్పటి వరకు ఆరుసార్లు గుట్టుగా గంజాయిని అనుకున్నచోటుకు తరలించారన్నారు.
గంజాయి తరలించే వెహికిల్ ముందు ఓ హ్యుందాయ్ క్రెటా కారును పైలట్లా పంపిస్తూ జాగ్రత్త పడుతున్నారని సమాచారం. శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చౌటుప్పల్ లోని వలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారని పైలట్గా వచ్చిన కారును అడ్డుకుని ఆ వెనకే వచ్చిన డీసీఎంను ఆపామన్నారు సీపీ డీఎస్చౌహాన్. అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్నిచూడగా శబ్దంలో తేడా వచ్చిందని, ఇనుపషీట్లపై బోల్టులు తొలగించడంతో 400 కిలోల గంజాయి ఉందన్నారు ఆయన. కారులో వచ్చిన ఇద్దరితోపాటు డీసీఎంలో వెళ్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు.